హైదరాబాద్, జూలై 28(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఆయిల్పామ్ విస్తరణలో భాగంగా మిగిలి ఉన్న ఐదు జిల్లాల్లోనూ సాగుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. దీంతో సంగారెడ్డి, మెదక్, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ జిల్లాల్లో ఆయిల్పామ్ సాగుకు మార్గం సుగుమమైంది. ఐదు జిల్లాలను ఐదు కంపెనీలకు కేటాయించింది. ఆ కంపెనీలు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొన్న తర్వాత సాగు ప్రణాళిక అమలులోకి రానున్నది.
ఈ ఐదు జిల్లాల్లో సుమారు 2 లక్షల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు చేసేందుకు అనుకూలత ఉన్నట్టు అధికారులు గుర్తించారు. వీటిలో అత్యధికంగా సంగారెడ్డి జిల్లాలోనే 47 వేల ఎకరాలను అనుకూలంగా తేల్చారు. ఆయా జిల్లాల్లో ఆయిల్పామ్ ఫ్యాక్టరీల ఏర్పాటుతో సుమారు 1500 మంది యువతకు ఉపాధి లభించే అవకాశం ఉన్నది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా ల్లో జోరుగా ఆయిల్పామ్ సాగవుతున్నది.