హైదరాబాద్ : అభివృద్ది, సంక్షేమ పథకాల్లో దేశానికే దిక్సూచిగా ఉన్న తెలంగాణ హరితనిధి ఏర్పాటుతో చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. రాష్ట్రం పచ్చబడాలనే ముఖ్యమంత్రి కేసీయార్ సంకల్పంతో దేశంలోనే తొలిసారిగా హరితనిధి ఏర్పాటైందని అన్నారు.
హరితనిధి విధివిధానాలు, విరాళాల జమపై సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో అంసెబ్లీ కమిటీ హాల్లో మంత్రుల సమీక్షా సమావేశం జరిగింది. మంత్రి హరీశ్ రావుతో పాటు, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, అటవీ పర్యావణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు.
హరిత తెలంగాణ సాధనలో సమాజంలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం విరాళాల రూపంలో ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నిధి ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని, ఏప్రిల్ నెల జీతాల నుంచి ఈ విరాళాల జమ ప్రక్రియ ప్రారంభమౌతుందని మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఇందుకోసం సంబంధిత శాఖలు అంతర్గత ఉత్తర్వుల ద్వారా పనిని ప్రారంభించాలన్నారు.
అలాగే తెలంగాణకు హరితహారం, హరితనిధి ఉద్దేశాలను అందరికి అర్థమయ్యేలా వివరించాలని కోరారు. ఇప్పటికే ఇచ్చిన ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం కంపెనీలు, షాపులు, వివిధ ఎస్టాబ్లిష్ మెంట్ల నుంచి తగిన మొత్తం హరిత నిధికి జమ అయ్యేలా చూడాలని మంత్రులు ఆదేశించారు.
అడవుల పరిరక్షణ, పచ్చదనం పెంచడంలో దేశంలోనే తెలంగాణ మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందని, ఏప్రిల్ 1 నుంచి హరిత నిధి అమలులోకి వచ్చి, మే నెల జీతాలతో నిధుల జమ ప్రారంభమౌతుందని అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. హరిత నిధి ద్వారా సమాజంలోనూ, పౌరుల్లోనూ పచ్చదనంపై బాధ్యత మరింత పెరుగుతుందని, జమ అయ్యే నిధితో నర్సరీల్లో మొక్కల పెంపకం, పచ్చదనం పెంపునకు ఎంతగానో దోహదపడుతుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
సమావేశంలో కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణి కుముదిని, అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఏ. శాంతి కుమారి, సాగునీటి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్, విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రధాక కార్యదర్శి సునీల్ శర్మ, సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆర్. ఎం. డోబ్రియల్, అదనపు పీసీసీఎఫ్ ఎం.సీ. పర్గెయిన్, కార్మిక శాఖ కమిషనర్ అహ్మద్ నదీమ్, సివిల్ సప్లయిస్ కమిషనర్ అనిల్ కుమార్, ఎస్సీ డెవలప్ మెంట్ సెక్రటరీ రాహుల్ బొజ్జా, పంచాయితీ రాజ్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ఆర్థిక శాఖ కార్యదర్శి శ్రీదేవి, ఆర్ అండ్ బీ సెక్రటరీ విజయేంద్ర, టీఎస్ఐఐసీ ఎండీ ఈవీ నర్సింహారెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.