Congress | హైదరాబాద్, అక్టోబర్ 16 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): కాంగ్రెస్పాలనలో కన్నడనాట కటిక చీకట్లు అలుముకొన్నాయి. రాష్ట్ర రాజధాని బెంగళూరులోనే రోజుకు నాలుగైదు గంటలపాటు విద్యుత్తు కోతలు విధిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అయితే అనధికార కోతలు ఆరేడు గంటలపాటు విధిస్తున్నట్టు సమాచారం. అక్టోబర్లో ఉష్టోగ్రతలు పెరుగడంతో విద్యుత్తు డిమాండ్ 15,000 మెగావాట్లకు చేరుకోగా, ఆ స్థాయిలో సరఫరా జరుగట్లేదని అధికారులు చెబుతున్నారు. 1,500 మెగావాట్ల నుంచి 2,000 మెగావాట్ల వరకూ లోటువిద్యుత్తు ఉన్నట్టు పేర్కొంటున్నారు. కర్ణాటక చరిత్రలోనే ఈ స్థాయి లోటువిద్యుత్తు గతంలో ఎన్నడూ రికార్డుకాలేదు. విద్యుత్తు కోతలపై సామాన్యులతోపాటు పారిశ్రామిక వర్గాలు సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పండుగ సమయాల్లో విద్యుత్తు కోతలు కొనసాగుతుండటంతో అపార్ట్మెంట్వాసులు డీజిల్ జనరేటర్లను కొనుక్కోవడం, కిరాయికి తెచ్చుకోవడం వంటివి చేస్తున్నారు.
కరెంట్ కోతలకు అనుగుణంగా ఐటీ కంపెనీలు షిఫ్టుల్లో మార్పుచేర్పులు చేస్తున్నాయి. బెంగళూరు శివారుల్లోని పలు పరిశ్రమలు ఇప్పటికే వారానికి రెండు రోజులు పవర్ హాలీడేలు ప్రకటించాయి. కొన్ని కంపెనీలు ఒక షిఫ్ట్ను రద్దు చేశాయి. విద్యుత్తు కోతలతో సాగునీటికి కటకట ఏర్పడి వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయి. దీంతో వందలాది మంది రైతులు రోడ్లమీదకు వచ్చి సర్కారుకు వ్యతిరేకంగా ధర్నాలు చేస్తున్నారు. పక్కనే ఉన్న తెలంగాణలో నాణ్యమైన కరెంటును నిరంతరాయంగా సరఫరా చేస్తుంటే.. తమ రాష్ట్రంలో కనీసం నాలుగు గంటలైనా నిరంతరాయంగా కరెంటు సరఫరా కావట్లేదని కర్ణాటక వాసులు వాపోతున్నారు. అధికారమిచ్చిన ఐదు నెలలకే కర్ణాటకను చీకటిపాలు చేసిన కాంగ్రెస్కు తెలంగాణలో పొరపాటున ఓటేస్తే పరిస్థితి ఏమిటని తెలంగాణబుద్ధిజీవులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
‘కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయిందన్నట్టుగా..’.. ప్రతి పేదవాడికి 200 యూనిట్ల విద్యుత్తును ఉచితంగా ఇస్తామని కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. అసలు విద్యుత్తు సరఫరాను సక్రమంగా చేయట్లేదు. సిలికాన్ సిటీగా పేరుగాంచిన బెంగళూర్లోనే నాలుగు, ఐదు గంటల పాటు విద్యుత్తు కోతలు విధిస్తున్నారు. దీంతో కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు కొన్ని ఐటీ కంపెనీలు షిఫ్టులను మారిస్తే, మరికొన్ని కంపెనీలు సాయంత్రం 4 గంటలలోపు పనులను పూర్తిచేసుకోవాల్సిందిగా ఉద్యోగులకు సూచిస్తున్నాయి. విద్యుత్తు కోతలకు భయపడి మరికొన్ని కంపెనీలు వర్క్ఫ్రమ్హోమ్ వ్యవధిని పొడిగించినట్టు సమాచారం. మరోవైపు, కరెంటు కోతలతో పారిశ్రామిక ఉత్పత్తి పడిపోతున్నదని, పవర్ హాలిడేలు ఇచ్చే దుస్థితి దాపురించిందని పారిశ్రామికవర్గాలు మండిపడుతున్నాయి. ప్రభుత్వ ఉదాసీనతపై ధ్వజమెత్తుతున్నాయి. ఇక గ్రామీణ ప్రాంతాలలో అయితే కచ్చితంగా ఎన్ని గంటలు కోత ఉంటుందో చెప్పలేని దుస్థితి. ఉత్తర కర్ణాటకలో అయితే విద్యుత్ కోతల సమస్య అంతా, ఇంతా కాదు. రాష్ట్రంలో ఎడాపెడా విద్యుత్తు కోతలను నిరసిస్తూ కర్ణాటక చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ పిలుపు మేరకు వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక వర్గాలు ఇప్పటికే పలుమార్లు బంద్ పాటించాయి.
బెంగళూరుతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడెక్కడ విద్యుత్తు కోతలు విధించేది బెంగళూర్ ఎలక్ట్రిసిటీ సైప్లె కంపెనీ లిమిటెడ్ (బీఈఎస్సీవోఎం)తో పాటు కర్ణాటక పవర్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (కేపీటీసీఎల్) ప్రకటిస్తున్నది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య కొన్ని చోట్ల, సాయంత్రం 5 గంటల వరకు మరికొన్ని చోట్ల విద్యుత్తు కోతలు ఉంటాయని ప్రతీవారం ప్రత్యేక షెడ్యూల్గా విడుదల చేస్తున్నది. ఉత్తర కర్ణాటకతో పాటు మంగళూరు, ఉడుపి, శివమొగ్గ తదితర జిల్లాల్లో విద్యుత్తు కోతలు ఎక్కువగా ఉన్నట్టు సమాచారం. జలవిద్యుదుత్పత్తి నెమ్మదించడం, కేపీటీసీఎల్ పరిధిలోని 13 థర్మల్ యూనిట్లలో ఏడు స్టేషన్లలో మాత్రమే కార్యకలాపాలు కొనసాగుతుండటం, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, పండుగల సీజన్, బొగ్గు కొరత, ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడమే రాష్ట్రంలో విద్యుత్తు కోతలకు కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
వ్యవసాయానికి సరిపడా నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తామంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఆ హామీని నిలబెట్టుకోవడంలో ఘోరంగా విఫలమైంది. గంటలకొద్దీ ఎడాపెడా విద్యుత్తు కోతలతో రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నది. ఫలితంగా వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయి. ఇది తట్టుకోలేని రైతులు బలవన్మరణానికి పాల్పడుతున్నారు. కర్ణాటకలోని గుల్బర్గా, బళ్లారి తదితర ప్రాంతాల్లోని 216 తాలూకాల్లోని వేలాదిమంది రైతులు వ్యవసాయ పంపుసెట్లపై ఆధారడుతూ పంటలసాగు చేస్తున్నారు. కోతలు లేకుండా విద్యుత్తు సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ కురుగోడు తాలూకా సింధిగేరి, బైలూరు, కగ్గల్, కల్లుకంభ, ముష్టగట్టి, కోళూరు బాదనహట్టి, వద్దట్టి తదితర గ్రామాలకు చెందిన వందలాది మంది రైతులు స్థానిక కురుగోడులోని గుల్బర్గా ఎలక్ట్రిసిటీ సైప్లె కంపెనీ లిమిటెడ్ (జెస్కాం) శాఖ కార్యాలయం ముందు ఇటీవల నిరసన ప్రదర్శనలు చేపట్టారు.