హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): ఓటర్ల జాబితాపై వివిధ పార్టీలు, ప్రజల నుంచి వ్యక్తమైన అనుమానాలను ఎన్నికల సంఘం నివృత్తి చేసింది. తమకు వచ్చిన ఫిర్యాదుల్లో 98 శాతం అపోహలేనని, కేవలం రెండు శాతం మాత్రమే వాస్తవాలు అని పేర్కొంది. ఫిర్యాదులపై తమ సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించారని తెలిపింది. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో 2.91 లక్షల ఓట్లపై ఈసీకి ఫిర్యాదులు వచ్చాయి. ఒకే ఇంటి నంబర్తో వేల సంఖ్యలో ఓట్లు ఉన్నాయని, ఆ ఓట్లు వేర్వేరు పోలింగ్ కేంద్రాల్లో ఉన్నాయని, స్థానికంగా లేని వారి పేర్లు జాబితాలో చేర్చారని పలువురు ఫిర్యాదు చేశారు. వీటిని పరిశీలించిన ఎన్నికల సిబ్బంది ఆ జాబితాలో ఎటువంటి లోపాలు లేనట్టు గుర్తించింది.
ఒకే ప్రాంతానికి చెందిన 53 వేల మంది ఓట్లు వేర్వేరు పోలింగ్ కేంద్రాల్లో ఉన్న మాట నిజమే. ఒకే కుటుంబానికి చెందిన సభ్యుల ఓట్లు వేర్వేరు కేంద్రాల్లో ఉన్నాయి. అయితే ఆ కేంద్రాలు ఒకే ప్రాంగణం (స్కూల్/కాలేజీ)లో ఉన్నట్టు గుర్తించారు. దీనివల్ల ఎటువంటి సమస్య లేదని పేర్కొన్నారు. ఒకే ఇంటి నంబర్తో 47,025 ఓట్లు ఉన్నట్టు గుర్తించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలో గతంలో కొన్ని మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు జీహెచ్ఎంసీలో కలిశాయి.
కానీ ఆ గ్రామాలు, మున్సిపాలిటీలలో ఇంటి నంబర్లు పాతవే కొనసాగుతున్నాయి. ఉదాహరణకు 1-1 అనే ఇంటి నంబర్ మున్సిపాలిటీలో, గ్రామ పంచాయతీలో కూడా ఉంటుంది. అవి జీహెచ్ఎంసీలో విలీనం అయిన తరువాత కూడా అవే ఇంటి నంబర్లు కొనసాగుతున్నాయి. ఓటర్ల జాబితాలో చూసినప్పుడు ఒకే ఇంటి నంబర్తో ఎక్కువ పేర్లు కనిపిస్తున్నాయి. మరికొన్ని చోట్ల అవే ఇంటి నంబర్లకు బై నంబర్లు ఇచ్చా రు. వీటిపై కూడా ఫిర్యాదులు వచ్చాయి. ఇవన్నీ సరైన పేర్లేనని, అక్రమాలు లేవని తేల్చారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కూడా ఓటర్ల జాబితాపై అనేక ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఎన్నికల సంఘం ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. గత రెండేండ్లలో చనిపోయిన వారి వివరాలను ఇంటి నంబర్ ఆధారంగా గుర్తించారు. మృతుల వివరాలను దవాఖానల నుంచి కూడా సేకరించారు. అయితే వారిలో ఎక్కువ మంది ఇతర జిల్లాలకు చెందిన వారు ఉన్నట్టు గుర్తించారు. మొత్తానికి మృతుల పేర్లను జాబితా నుంచి తొలగించారు.
నిర్మల్ నియోజకవర్గంలో 41వేల ఓట్లపై ఫిర్యాదులు అందాయి. ఒకే ఇంటి నంబర్తో ఉన్న ఓట్లు వేర్వేరు పోలింగ్ కేంద్రాల్లో ఉన్నాయని, స్థానికంగా లేని వారి పేర్లు జాబితాలో ఉన్నాయని ఫిర్యాదు చేశారు. దీనిపై జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయి విచారణ జరిపింది. వీటిలో 37,695 మంది ఓటర్లు ఆ నియోజకవర్గం పరిధిలోనే ఉన్నారు. కొందరు ఇల్లు మారినా వారు పాత పోలింగ్ కేంద్రంలోనే ఓటు హక్కు వినియోగించుకుంటామని సమాధానం ఇచ్చారు. వారు చిరునామా మార్పునకు అవసరమైన ఫారం-7ను అందించడానికి వారు నిరాకరించారు. ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయిన 809 మంది పేర్లను తొలగించారు.