కరీంనగర్/ హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ) : స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ (ఎస్ఎంసీ) ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. పదోతరగతి పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో ఉపాధ్యాయ, విద్యార్థి అన్ని వర్గాల నుంచి విమర్శలు రావడంతో ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకొన్నది. సర్కారు బడుల్లో ఈ నెల 29న నిర్వహించ తలపెట్టిన స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ (ఎస్ఎంసీ) ఎన్నికలను నిలిపివేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన మంగళవారం రాత్రి ఉత్తర్వులిచ్చారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఎన్నికలు నిర్వహించరాదని పేర్కొన్నారు. అన్ని జిల్లాల్లోని విద్యాధికారులందరూ ఈ నిబంధనలను పాటించాలని ఆదేశించారు. వాస్తవానికి, రాష్టంలోని సాధారణ పాఠశాలలతోపాటు కేజీబీవీలు, మాడల్ స్కూళ్లు, జనరల్ గురుకులాలు, ఎయిడెడ్ తదితర పాఠశాలల్లో ఒకటి నుంచి 8వ తరగతి వరకు ఉన్న పాఠశాలల్లో ఎస్ఎంసీలు ఎన్నికలు నిర్వహించాలని ఇటీవలే ఉత్తర్వులిచ్చారు.
ఎస్ఎంసీ ఎన్నికల నిర్వహణకు ఈ నెల 18న షెడ్యూల్, మార్గదర్శకాలను పాఠశాల విద్యాశాఖ జారీచేసింది. ఈ నెల 20న నోటిఫికేషన్ జారీ, విద్యార్థుల తల్లిదండ్రుల జాబితా నోటీసు బోర్డులో ప్రదర్శించాలని, 22న తల్లిదండ్రుల జాబితాపై ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు అభ్యంతరాలు స్వీకరించాలని, 24న 11 గంటలకు తల్లిదండ్రుల తుదిజాబితా ప్రకటించాలని, 29న ఉదయం ఎస్ఎంసీ ఎన్నిక నిర్వహించాలని ఆదేశాలిచ్చారు. అయితే, పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణపై టీచర్లు, ఉపాధ్యాయ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశారు.
పాఠశాల విద్యాకమిటీ ఎన్నికలు పరీక్షల ముందు నిర్వహిస్తే విద్యార్థులకు జరిగే నష్టాలను ‘నమస్తే తెలంగాణ’ దినపత్రిక ఈ నెల 20న ‘పరీక్షల ముందు పాఠశాల ఎన్నికలా..?’ శీర్షిక పేరిట కథనం ప్రచురించింది. అందులో వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకుల అభిప్రాయాలను కూడా ప్రచురించింది. ఈ ఎన్నికలను వాయిదా వేయాలన్న డిమాండ్ను ప్రభుత్వం ముందుకు ‘నమస్తే తెలంగాణ’ తీసుకెళ్లింది.
ఈ కథనంపై గడిచిన రెండు రోజులుగా సమీక్షలు నిర్వహించి, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయసంఘాల నాయకుల అభిప్రాయాలను కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకొన్నట్టుగా తెలిసింది. దీంతో ఎన్నికలు నిర్వహిస్తే బోధనకు పలు ఆటంకాలు ఏర్పడుతాయని ‘నమస్తే తెలంగాణ’ ప్రచురించిన కథనం పూర్తి వాస్తవమని వారు తమ అభిప్రాయాలు చెప్పినట్టుగా తెలిసింది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర విద్యాశాఖ.. పాఠశాల కమిటీ ఎన్నికలను నిలిపివేస్తూ ప్రకటన జారీచేసింది. వెంటనే ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని, తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు పాఠశాల ఎన్నికలను నిలుపుచేయాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీ దేవసేన ఆదేశించారు. మొత్తం మీద ఎన్నికలు నిలిపివేడయంతో పాఠశాల ఉపాధ్యాయులు ఊపిరిపీల్చుకొన్నారు.