70 ఏండ్ల కిందట ఆంధ్రాతో విలీనం కాని వేళ.. హైదరాబాద్ రాష్ట్రం స్వపాలనలో.. ఆనకట్టలు కట్టి కృష్ణమ్మను ఒడిసిపట్టేందుకు.. కాలువల ద్వారా పారించి బీళ్లను తడిపేందుకు.. పాలమూరు బిడ్డల దాహం తీర్చేందుకు.. ఎన్నో ప్రణాళికలు.. మరెన్నో ప్రాజెక్టులకు రూపకల్పనలు.. ఇంకెన్నో కలలు. కానీ ఒక బలవంతపు విలీనం.. ఒక కుట్రపూరిత వ్యూహం.. పక్షపాతపూరిత పాలన స్వభావం.. తెలంగాణ కలలకు గండికొట్టింది. ప్రాజెక్టులకు మరణ శాసనం రాసింది. కాగితాలపైనే లేకుండా ప్రాజెక్టులను కనుమరుగు చేసింది. వెరసి తెలంగాణ కల చెదిరింది. పాలమూరు వాకిలి పొక్కిలైంది. మళ్లా ఇప్పుడు తెలంగాణ స్వరాష్ట్రంలో..కేసీఆర్ సారథ్యంలో.. కృష్ణమ్మ చెంతకు చేరడంతో.. ‘పాలమూరు’ సేదతీరుతున్నది. కొత్త చరితను లిఖిస్తున్నది. కొడిగట్టుకుపోయిన కలలను సాకారం చేసుకుంటున్నది. భావితతరానికి బంగారు బాటలు వేసుకుంటున్నది.
(మ్యాకం రవికుమార్) హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మహబూబ్నగర్ కృష్ణా పరివాహక ప్రాంతం దాదాపు 61 శాతం. మరోవైపు తుంగభద్ర. ఇంకోవైపు భీమా.. దుందుభి నదులు. అపారమైన నీటి వనరులు. ఏకంగా 35 లక్షల ఎకరాలకుపైగా సాగుకు యోగ్యమైన భూములు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ స్టేట్ ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు 1935 నుంచే అనేక ప్రాజెక్టులకు రూపకల్పన చేసింది. నికరంగా 174 టీఎంసీలను ఒడిసిపట్టి, గ్రావిటీతోనే దాదాపు 7 లక్షల ఎకరాలకు సాగునీరందించేందుకు ప్రణాళికలను సిద్ధం చేసింది. అప్పర్ కృష్ణా ప్రాజెక్టు, తుంగభద్ర డ్యామ్, భీమా ప్రాజెక్టుల నిర్మాణానికి సర్వేలు చేసింది.
పొరుగున ఉన్న అప్పటి మైసూరు, మద్రాసు రాష్ర్టాలతో సంప్రదింపులు జరిపింది. పలు ఒప్పందాలు చేసుకొన్నది. ప్రాజెక్టుల నిర్మాణానికి నడుంకడుతున్న సమయంలోనే విలీనం పేరిట ఊహించని వంచనకు గురైంది. వద్దని వారించినా, నదీజలాల్లో హక్కు కోల్పోతామని మొత్తుకున్నా వినకుండా తేనేపలుకులతో నాటి కాంగ్రెస్ తెలంగాణను బలవంతంగా ఆంధ్రాలో విలీనం చేసింది. అది తెలంగాణకు, ముఖ్యంగా పాలమూరుకు శాపంలా మారింది. అప్పటివరకు కృష్ణాలో కేవలం 8 శాతంగా ఉన్న కర్ణాటక పరివాహక ప్రాంతం హైదరాబాద్ స్టేట్లోని అనేక ప్రాంతాలు (ఇప్పటి రాయచూర్, బీదర్, యాద్గిర్, కొప్పల్, గుల్బర్గా తదితర ప్రాంతాలు) కలవడంతో ఏకంగా 44 శాతానికి పెరిగింది. తెలంగాణకు ఆ మేరకు పరివాహక ప్రాంతం తగ్గి బచావత్ కేటాయింపుల్లోనూ మొదట అన్యాయానికి గురైంది. మరోవైపు ఉమ్మడి ఏపీలో వివక్షకు గురై ఉన్న పరివాహకం మేరకు కూడా కేటాయింపులు లేక అల్లాడిపోయింది. హైదరాబాద్ స్టేట్ ప్రణాళికలన్నీ అటకెక్కాయి.
కృష్ణా నదికి ఉన్న రెండో అతిపెద్ద ఉపనది తుంగభద్ర. సరాసరి తుంగభద్ర నుంచి దాదాపు 550 టీఎంసీల వరకు జలాలు కృష్ణాలోకి వస్తాయి. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ స్టేట్ తుంగభద్ర జలాలను వినియోగించుకొనేందుకు ప్రణాళిక చేసింది. మద్రాసు రాష్ట్రంతో 1930 నుంచే సంప్రదింపులు జరుపగా, 1944లో అంగీకారానికి వచ్చాయి. నేటి కర్ణాటక హోస్పేట్ వద్ద తుంగభద్ర డ్యామ్ నిర్మాణాన్ని ప్రారంభించారు. ఈ డ్యామ్ కుడి కాలువ ద్వారా కర్ణాటకలోని బళ్లారితోపాటు కర్నూలు, అనంతపూర్కు, ఎడమ కాలువ ద్వారా కర్ణాటకలోని రాయచూర్, దిగువన లోలెవల్ కాలువ ద్వారా తెలంగాణలోని ఆలంపూర్ వరకు సాగునీటిని అందించేందుకు ప్రణాళిక చేశారు. ఒప్పందం మేరకు డ్యామ్ నిర్మాణం పూర్తయింది. కాలువ తవ్వకం ప్రారంభమయ్యే నాటికి రాష్ర్టాల విలీనం జరిగిపోయింది. అదే అదునుగా కర్ణాటక రాష్ట్రం ఎడమ కాలువను 250 కిలోమీటర్ల మేర కేవలం రాయచూర్ వరకు మాత్రమే నిర్మించింది. లోలెవల్ ఆలంపూర్ బ్రాంచ్ కెనాల్ను పక్కకు పెట్టింది. తద్వారా పాలమూరు 19.2 టీఎంసీలను నష్టపోయింది. ఏపీ పాలకులు ఎడమ కాలువ లోలెవల్ కెనాల్ విస్తరణపై కర్ణాటకను ఒత్తిడి చేయలేదు.
తుంగభద్ర డ్యామ్ దిగువన 1944 ఒప్పందంలో భాగంగా హైదరాబాద్ స్టేట్ ఆర్డీఎస్ (రాజోలిబండ డైవర్షన్ స్కీమ్), దాని దిగువన మద్రాస్ స్టేట్ సుంకేసుల ఆనకట్టలను నిర్మించాయి. ఆ ఒప్పందం ప్రకారం కెనాల్లకు సమానంగా నీటిని వినియోగించుకోవాల్సి ఉంది. అయితే, హైదరాబాద్ స్టేట్ను ఏపీతో విలీనం చేసిన తర్వాత కుట్రలు మొదలయ్యాయి. 1970లో బచావత్ ట్రిబ్యునల్ ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేసీ కెనాల్కు 69.4 టీఎంసీలు, ఆర్డీఎస్ కెనాల్కు 15.9 టీఎంసీలు డిమాండ్ చేసి, మహబూబ్నగర్ జిల్లాకు అన్యాయం చేసింది. ఉమ్మడి ఏపీ వాదనలతో ట్రిబ్యునల్ కేసీ కెనాల్కు 39.9 టీఎంసీలు, మహబూబ్నగర్ జిల్లాకు 15.9 టీఎంసీలు కేటాయించింది. తర్వాత బ్రిజేష్ ట్రిబ్యునల్ ఎదుట అసలు కేసీ కెనాల్ ఊసే ఎత్తకుండా ఆర్డీఎస్ ఆనకట్ట వద్ద కుడి వైపుకు కొత్తగా కెనాల్ కోసం 4 టీఎంసీలు కేటాయింపులు చేయాలని సమైక్య సర్కారు కోరింది.
ఇదిలా ఉంటే, ఆర్డీఎస్ ఆనకట్ట నిర్వహణను సీమాంధ్రపాలకులు పూర్తిగా గాలికి వదిలేశారు. ఫలితంగా ఆర్డీఎస్ కాలువ హెడ్వర్క్స్ వాస్తవ సామర్థ్యం 850 క్యూసెక్కుల నుంచి 400 క్యూసెక్కులకు పడిపోయింది. అదీగాక ఆనకట్ట నీటి నిల్వ సామర్థ్యం కూడా తగ్గిపోగా, 15.90 టీఎంసీలకుగాను 5 టీఎంసీలు కూడా అందుబాటులో ఉండని దుస్థితి నెలకొన్నది. ఉమ్మడి పాలకుల అండగా ఆర్డీఎస్ తూములను పగలగొట్టి మరీ నీళ్లను దిగువన తుంగభద్రను తరలించుకుపోవడం పరిపాటిగా మారినా ఏ ఒక్క కేసు నమోదయ్యేది కాదు. ఫలితంగా తెలంగాణకు సాగునీరు గగనమైపోయింది. ఇదిలా ఉంటే సుంకేసుల ఆనకట్ట సామర్థ్యం మేరకు నీరందివ్వడం లేదని చెప్పి ఆనకట్ట స్థానంలో బరాజ్ను నిర్మించిన ఉమ్మడి ఏపీ పాలకులు ఆర్డీఎస్ను మాత్రం పట్టించుకోలేదు. తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో ఆర్డీఎస్ ఆధునీకరణకు మాత్రమే 2004లో నిపుణుల కమిటీ వేసింది. ఆ కమిటీ ఆర్డీఎస్ ఆనకట్ట ఎత్తు ఒక అడుగు పెంచాలని సూచించినా.. కేవలం 6 అంగుళాల మేర మాత్రమే పెంచడానికి మాత్రమే పూనుకోవడం నాటి పాలకుల కుట్రలకు నిదర్శనం. తెలంగాణ ఏర్పాటు అనంతరం సీఎం కేసీఆర్ ఆర్డీఎస్ ఆధునీకరణకు చర్యలు చేపట్టారు. ఏపీ మాత్రం పనులను ముందుకు సాగనివ్వ లేదు. ఈ నేపథ్యంలోనే ఆర్డీఎస్ ఆయకట్టు కోసం తెలంగాణ ప్రత్యేకంగా తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని నిర్మించింది. ఫలితంగా నేడు 50 వేల ఎకరాలకు నీరు అందుతున్నది.
కృష్ణా నదికి ఉన్న అతిపెద్ద ఉపనదుల్లో భీమా మొదటిది. దీని నుంచి దాదాపు 380 టీఎంసీల వరకు జలాలు కృష్ణా నదిలో కలుస్తుంటాయి. ఈ నేపథ్యంలో 1944లోనే హైదరాబాద్ స్టేట్ తన పరిధిలోని గుల్బర్గా జిల్లాలో భీమా నదిపై 100 టీఎంసీల సామర్థ్యంతో డ్యామ్ను నిర్మించేందుకు ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. డ్యామ్ ఎడమ కాలువను 149 మైళ్ల (238కిలోమీటర్ల) పొడవుతో తవ్వి మహబూబ్నగర్కు గ్రావిటీద్వారా కోస్గి, కొడంగల్ వరకు సాగునీరందించాలని ప్రణాళికలను రచించింది. రాష్ర్టాల విలీనంతో ఇది కూడా ఉనికిలో లేకుండా పోయింది. గుల్బర్గా.. కర్ణాటక రాష్ట్రంలో కలిసిపోయింది. తద్వారా మహబూబ్నగర్ జిల్లా తీవ్రంగా నష్టపోయింది. ఆ తర్వాత మహారాష్ట్ర హైదరాబాద్ ప్రతిపాదించిన ప్రాజెక్టును ఎగువకు మార్చుకుని 110 టీఎంసీల సామర్థ్యంతో ఉజ్జయిని డ్యామ్ నిర్మించుకొన్నది.
1933 నాటికే నాటి హైదరాబాద్, మద్రాసు రాష్ట్ర ప్రభుత్వాలు కృష్ణా నదిపై ఉమ్మడిగా ఒక ప్రాజెక్టును చేపట్టాలని అంగీకారానికి వచ్చాయి. హైదరాబాద్ స్టేట్ ఇన్వెస్టిగేషన్ చేపట్టి కృష్ణా నదిపై ప్రస్తుతమున్న నారాయణపూర్ వద్ద అప్పర్ కృష్ణా ప్రాజెక్టును చేపట్టాలని ప్రతిపాదించింది. నారాయణపూర్ డ్యాం నుంచి కుడి కాలువ ద్వారా నేటి కర్ణాటకలోని విజయపురి జిల్లా నుంచి గుల్బర్గా, అటు తర్వాత మహబూబ్నగర్ వరకు గ్రావిటీ కాలువ ద్వారా సాగునీటిని అందిచాలని నిర్ణయించింది. ఆ కాలువ ద్వారా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు 54.4 టీఎంసీల నీరు రావాల్సి ఉంది. కానీ రాష్ర్టాల విలీనంతో హైదరాబాద్ స్టేట్ ఉనికితోపాటు ఆ ప్రాజెక్టును కూడా కోల్పోయింది. కొత్తగా ఏర్పడిన కర్ణాటక రాష్ట్రం హైదరాబాద్ స్టేట్ ప్రతిపాదించిన చోటుకు ఎగువన ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులను నిర్మించినా కాలువలను మాత్రం కేవలం సరిహద్దులోని గుల్బర్గ వరకు మాత్రమే పరిమితం చేసింది. తద్వారా మహబూబ్నగర్ తీవ్రంగా నష్టపోయింది.
స్వరాష్ట్రంలో చేసుకున్న సాగునీటి ప్రణాళికలన్నీ 70 ఏండ్లపాటు వలస పాలకులు అటకెక్కించారు. రాష్ర్టాల పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 107, 108 ప్రకారం నదీ జలాల వినియోగం కోసం హైదరాబాద్ స్టేట్ రూపొందించిన ప్రాజెక్టుల ద్వారా మహబూబ్నగర్ జిల్లాకు జలాలను కేటాయించే అవకాశమున్నా ఏనాడూ ఉమ్మడి ఏపీ ప్రభుత్వం ఆ పని చేయలేదు. మహబూబ్నగర్ దుర్భర పరిస్థితిని చూసి బచావత్ ట్రిబ్యునల్ చలించిపోయి జూరాల ప్రాజెక్టుకు 17.84 టీఎంసీలు కేటాయించడమేకాదు.. ఆ జలాలను మహబూబ్నగర్ జిల్లాలో మాత్రమే వినియోగించాలని ఉమ్మడి ఏపీ సర్కారుకు షరతులు పెట్టింది. 70 ఏండ్ల అనంతరం నేడు తెలంగాణ స్వరాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ మొక్కవోని సంకల్పంతో నాటి ప్రణాళికలన్నీ జీవం పోసుకొన్నాయి. హైదరాబాద్ స్టేట్ మహబూబ్నగర్ జిల్లాలో 174 టీఎంసీల జలాలతో 7 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలనే దశాబ్దాల స్వప్నం.. సాకారమైంది.