Nepal PM : భారత్ (India) తో సరిహద్దు వివాదంపై నేపాల్ ప్రధానమంత్రి (Nepal PM) బాలేంద్ర షా (బాలేన్ షా) (Balen Shah) పార్లమెంట్లో చేసిన వ్యాఖ్యలు ఆ దేశంలో తీవ్ర రాజకీయ దుమారానికి దారితీశాయి. కాలాపానీ (Kalapani), లిపులేఖ్ (Lipulek), లింపియాధురా (Limpiadhura) ప్రాంతాలపై వివాదం నడుస్తున్న నేపథ్యంలో.. భారత్తోపాటు నేపాల్ కూడా కొన్నిచోట్ల సరిహద్దు ఆక్రమణలకు పాల్పడిందని ప్రధాని బాలేన్ షా అంగీకరించారు. దీనిపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
ప్రధాని వ్యాఖ్యలు నేపాల్ ప్రాంతీయ సార్వభౌమత్వాన్ని బలహీనపరిచేలా ఉన్నాయని ఆరోపిస్తూ ప్రతిపక్షాలు, విద్యార్థి సంఘాలు ఖాట్మండు వీధుల్లో ప్రదర్శనలు చేపట్టారు. బాలేన్ షా తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మే 31న పార్లమెంట్ సమావేశంలో ప్రధాని బాలేన్ షా మాట్లాడుతూ.. తాను పదవిలోకి వచ్చిన తర్వాతే ఈ విషయాలు తెలుసుకున్నానని, కేవలం భారత్ మాత్రమే కాదు, నేపాల్ కూడా పలుచోట్ల భారత భూభాగాన్ని ఆక్రమించిందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
చరిత్రకారులు, సర్వే నిపుణుల ఉమ్మడి బృందాల ద్వారా దౌత్యపరంగా ఈ సమస్యను పరిష్కరించాలని ఆయన పిలుపునిచ్చారు. 1816 నాటి సుగౌలీ ఒప్పందం కాలం నుంచి ఉన్న ఈ వివాదంపై తాము భారత్, చైనాలతో పాటు బ్రిటన్ ప్రభుత్వంతో కూడా సంప్రదింపులు జరుపుతున్నట్లు ప్రధాని వెల్లడించారు. ప్రధాని వ్యాఖ్యలు పార్లమెంట్లో తీవ్ర గందరగోళానికి దారితీయడంతో నేపాల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ డ్యామేజ్ కంట్రోల్ చర్యలు చేపట్టింది. ప్రధాని పేర్కొన్న ‘ఆక్రమణలు’ అనే పదం కాలాపానీ, లిపులేఖ్ వంటి ప్రధాన వివాదాస్పద ప్రాంతాలను ఉద్దేశించినది కాదని స్పష్టం చేసింది.
నదీ సరిహద్దులు మారడం వల్ల ‘నో-మ్యాన్స్ ల్యాండ్’ (దస్గజా) ప్రాంతంలో ఇరుదేశాల ప్రజలు సాగు చేసుకుంటున్న సరిహద్దు దాటిన చిన్నపాటి ఆక్రమణలను మాత్రమే ప్రధాని ప్రస్తావించారని విదేశాంగ శాఖ వివరణ ఇచ్చింది. లిపులేఖ్ పాస్ ద్వారా కైలాశ్ మానససరోవర్ యాత్రను పునఃప్రారంభించడానికి భారత్, చైనాలు సిద్ధమవడంతో ఈ ఏడాది మే నెలలో ఇరుదేశాల మధ్య మళ్లీ ఘర్షణ వాతావరణం ఏర్పడింది. 2025లో యువత నేతృత్వంలో జరిగిన అవినీతి నిరోధక నిరసనల ద్వారా అధికారంలోకి వచ్చిన బాలేన్ షా నేతృత్వంలోని ‘రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ’.. ఇప్పుడు అదే తరహా నిరసనలను ఎదుర్కోవాల్సి వస్తోంది.