Dharani | హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): ధరణి పోర్టల్ను మరింత పటిష్టం చేసేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలన్న దానిపై అధ్యయనం చేస్తున్నట్టు ధరణి పునర్నిర్మాణ కమిటీ పేర్కొంది. ప్రజలు ఇబ్బందులు పడకుండా సాఫ్ట్వేర్తోపాటు చట్టాల్లో ఎలాంటి మార్పుచేర్పులు చేయవచ్చో ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని తెలిపింది. సీసీఎల్ఏ కార్యాలయంలో కమిటీ సోమవారం సమావేశమైంది. అనంతరం కమిటీ సభ్యులు రేమండ్ పీటర్, సునీల్ కుమార్, మధుసూదన్, కోదండరెడ్డి, సీఎంఆర్వో ప్రాజెక్ట్ డైరెక్టర్ వీ లచ్చిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా రేమండ్ పీటర్ మాట్లాడుతూ ధరణిలో లోపాలు సరిదిద్దేందుకు ఏమేం చేయాలో చర్చించినట్టు తెలిపారు. రెండుమూడు రోజుల్లో ఎంపిక చేసిన ఐదారు జిల్లాల కలెక్టర్లతో సమావేశం కానున్నట్టు చెప్పారు. ఆ తర్వాత అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తామని వివరించారు. అనంతరం ఆర్డీవోలు, ఎమ్మార్వోలతోనూ సమావేశం అవుతామని చెప్పారు. పోర్టల్కు వ్యవసాయం, స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖతోనూ సంబంధాలు ఉన్నాయని, కాబట్టి ఆయా శాఖల అధికారులతో చర్చలు జరుపుతామని తెలిపారు. అనంతరం ప్రభుత్వానికి మధ్యంతర నివేదిక అందిస్తామని పేర్కొన్నారు. ధరణిలో ఎన్నిరకాల సమస్యలు ఉన్నాయో గుర్తించి, నమూనా కోసం కొన్ని కేస్స్టడీలను పరిశీలిస్తామని, అవసరమైతే జిల్లాలు, గ్రామాలకు వెళ్తామని తెలిపారు.