New School timings | హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పాఠశాలల పనివేళలు మార్చుతూ పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకొన్నది. ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉదయం 9.30 గంటలకు ప్రారంభమయ్యేలా మార్పులు తెచ్చింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ సహా అన్ని రకాల ప్రాథమిక స్కూళ్లు ఉదయం 9.30 గంటలకు ప్రారంభమై సాయంత్రం 4.15 గంటలకు ముగుస్తాయి.
ప్రాథమికోన్నత బడుల్లో ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు నడుస్తాయి. ఉన్నత పాఠశాలల సమయాల్లో ఎలాంటి మార్పు లేదు. ఇవి గతంలో ప్రకటించినట్టుగానే ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు నిర్వహిస్తారు. అయితే, హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలకు విద్యాశాఖ మినహాయింపు ఇచ్చింది. ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలలు ఉదయం 8.45 నుంచి సాయంత్రం 4 గంటల వరకు నడవనుండగా, ప్రాథమిక పాఠశాలలు మాత్రం కాస్త ముందుగా ఉదయం 8.45 గంటల నుంచి మధ్యాహ్నం 3.45 గంటల వరకే నిర్వహిస్తారు. మారిన బడి వేళలు మంగళవారం నుంచే అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. ఈ ఆదేశాలు పాటించేలా ఎంఈవోలు, డీఈవోలు, ఆర్జేడీలు చూడాలని శ్రీదేవసేన ఆదేశించారు.