Telangana Decade Celebrations | ఆకాశమంత ఎత్తులో రాష్ట్ర సెక్రటేరియట్.. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం.. చేతులెత్తి స్మరించుకొనే అమరుల చిహ్నం.. రాజధానిలో కండ్లు తిప్పుకోనీయని కట్టడాలు.. చెప్పుకుంటూపోతే జిల్లాకో పాలనాభవనం.. కేవలం 9 ఏండ్లలో అత్యద్భుత ప్రగతి.. ఇది మన విజయం! తెలంగాణ వైభవం!!
హైదరాబాద్: తెలంగాణలో రోడ్లు, భవనాల శాఖ అద్వితీయమైన విజయాలను నమోదు చేసింది. తొమ్మిదేండ్లలోనే 102లక్షల చదరపు అడుగుల మేర భవనాలు, 8,578 కిలోమీటర్లమేర రోడ్లు, 382 వంతెనలను నిర్మించి తనకు మరే రాష్ట్రమూ సాటిరాదని నిరూపించింది. నూతన సచివాలయం, 125 అడుగుల పొడవైన అంబేద్కర్ విగ్రహం, అమరవీరుల స్మారక చిహ్నం వంటి కట్టడాలను నిర్మించింది. తెలంగాణ ఏర్పాటుకు ముందు కేవలం 30.43 లక్షల చదరపు అడుగుల ప్రభుత్వ భవనాలు ఉండగా, తెలంగాణ ఏర్పాటైన తర్వాత తొమ్మిదేండ్లలో 300 రెట్లు అధికంగా.. అంటే 102.02 లక్షల చదరపు అడుగుల మేర కొత్త నిర్మాణాలు పూర్తి చేసింది. రాష్ట్రం ఏర్పడే నాటికి రహదారుల పరిస్థితి అధ్వాన్నంగా ఉండేది. జాతీయ రహదారులు తకువగా ఉండేవి. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ రహదారుల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యమిచ్చారు. గ్రామాల్లోని రోడ్లతో పాటు మండలాల నుంచి జిల్లాకేంద్రాలకు, జిల్లా కేంద్రాల నుంచి రాష్ట్ర రాజధానికి రోడ్లను అభివృద్ధి చేశారు. ఫలితంగా రాష్ట్రంలో అన్నిరకాల రోడ్లు 1,09,260 కిలోమీటర్లకు చేరుకున్నాయి.
సమీకృత కలెక్టరేట్ల నిర్మాణం
రాష్ట్రంలోని 30 జిల్లాల్లో రూ.1,649.62 కోట్లతో ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీసెస్ కాంప్లెక్సెస్(ఐడీఐసీ) నిర్మాణాన్ని చేపట్టింది. ఇప్పటివరకు రూ.1058.04 కోట్ల పనులు పూర్తయ్యాయి. హైదరాబాద్, సంగారెడ్డి, నల్లగొండ కలెక్టరేట్ భవనాలు ఇదివరకే ఉండగా సిద్దిపేట, కామారెడ్డి, హనుమకొండ, రాజన్న సిరిసిల్ల, జనగామ, యాదాద్రి భువనగిరి, వనపర్తి, మేడ్చల్, రంగారెడ్డి, పెద్దపల్లి, నిజామాబాద్, మహబూబ్నగర్, జగిత్యాల, వికారాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ కలెక్టరేట్లు ప్రారంభమయ్యాయి. నిర్మల్, గద్వాల, కుమ్రంభీం ఆసిఫాబాద్, నాగర్కర్నూల్, సూర్యాపేట, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, మెదక్, కరీంనగర్లో తుదిదశకు చేరుకున్నవి.
అధికారుల క్వార్టర్లు ఇలా..
కలెక్టరేట్లతోపాటు కలెక్టర్ బంగ్లా, జాయింట్ కలెక్టర్, జిల్లా రెవెన్యూ అధికారి, ఇతర జిల్లా అధికారులకు క్వార్టర్స్ నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు జగిత్యాల, కామారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో అందుబాటులోకి వచ్చాయి.
ఎమ్మెల్యేల నివాస-కార్యాలయ భవనాలు
ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉండేలా అన్ని నియోజకవర్గాల్లో రూ.139 కోట్లతో రెసిడెన్షియల్ కమ్ ఆఫీస్ భవనాల నిర్మాణం చేపట్టారు. 112 భవనాలను మంజూరుచేయగా, 95 ఇప్పటికే పూర్తయ్యా యి. మిగిలిన వాటి పనులు పురోగతిలో ఉన్నాయి.
అనీస్-ఉల్-గుర్బా
అనాథలైన మైనారిటీ బాలురు, బాలికల కోసం 39 కోట్లతో నాంపల్లిలో అనీస్-ఉల్-గుర్బా పేరుతో ఓ అనాథ శరణాలయాన్ని నిర్మిస్తున్నది. ఇందులో ఆఫీసు కార్యాలయంతోపాటు బాలురు, బాలికలకు విడివిడిగా వసతి గృహాలుంటాయి.
సమీకృత కమాండ్ కంట్రోల్ సెంటర్
నేరాలపై నిఘా సహా బహుళ ప్రయోజనాలను కాంక్షిస్తూ ప్రభుత్వం బంజారాహిల్స్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూ.585 కోట్లతో సమీకృత కమాండ్ కంట్రోల్ సెంటర్ను నిర్మించింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలను దీనితో అనుసంధానం చేసింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఇది పనిచేస్తున్నది. ప్రకృతి విపత్తులు, వర్షాల సందర్భంగా వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ తగిన చర్యలు తీసుకొనేలా ఇందులో సౌకర్యాలు కల్పించారు.
తెలంగాణ అమరుల చిహ్నం
సచివాలయానికి ఎదురుగా లుంబినీ పారు సమీపంలో అమరవీరుల స్మారక చిహ్నాన్ని రూ.177.50 కోట్లతో నిర్మించింది. తెలంగాణ ఉద్యమ ఘట్టాలను వివరించే మ్యూజియంతోపాటు అనేక సౌకర్యాలను ఏర్పాటు చేశారు. త్వరలో ప్రారంభించనున్నారు.
బీఆర్ అంబేదర్ సచివాలయం
రూ.617 కోట్లతో ప్రభుత్వం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్మించింది. 28 ఎకరాల్లో 7,79,982 చదరపు అడుగుల విస్తీర్ణంలో 7 అంతస్థుల్లో 265 అడుగుల ఎత్తుతో దీనిని నిర్మించారు. ముఖ్యమంత్రి, మంత్రులు, ఆయా శాఖల ముఖ్య అధికారులు, ఆయా శాఖల కార్యాలయాలను విశాలంగా నిర్మించారు. అన్ని శాఖలూ ఒకే సముదాయంలో ఉండటం దీని ప్రత్యేకత. ఇంత ఎత్తయిన సచివాలయం ఏ రాష్ట్రంలోనూ లేదు. 26 నెలల రికార్డు సమయంలో దీని నిర్మాణాన్ని పూర్తి చేశారు.
సమీకృత కలెక్టరేట్ భవనాల విశేషాలు
రీజినల్ రింగ్ రోడ్డు
హైదరాబాద్ శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణాన్ని ప్రభుత్వం చేపడుతున్నది. జాతీయ రహదారుల శాఖ ఆధ్వర్యంలో పనులు చేపడుతుండగా, రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణకు అవసరమైన నిధులను భరిస్తున్నది. దీని వల్ల ట్రాఫిక్ రద్దీ తగ్గటంతో పాటు జిల్లాల నుండి హైదరాబాద్కు మెరుగైన రవాణా సౌకర్యం కలగనున్నది. ప్రస్తుత ఔటర్ రింగ్ రోడ్కు 30 కిలోమీటర్ల అవతల 340 కిలోమీటర్ల పొడవున రీజినల్ రింగ్ రోడ్ నిర్మాణం చేపడుతుండగా, భూసేకరణకు ఇటీవలే రూ.100 కోట్లు మంజూరు చేసింది.
ఆర్అండ్బీ పునర్వ్యవస్థీకరణ
రోడ్లు భవనాలశాఖ సేవలను ప్రజలకు చేరువ చేయడంతోపాటు రోడ్ల నిర్వహణ సమర్థంగా చేపట్టాలనే లక్ష్యంతో ఆర్అండ్బీ శాఖను పునర్వ్యవస్థీకరించారు. రెండు చీఫ్ ఇంజినీర్(సివిల్), ఒక చీఫ్ ఇంజినీర్(ఎలక్ట్రికల్), 10 సివిల్ సూపరింటెండెంట్ ఇంజినీర్, రెండు ఎలక్ట్రికల్ సూపరింటెండెంట్ ఇంజినీర్ పోస్టులు సహా 472 కొత్త పోస్టులను ఖరారు చేశారు. ఇందుకోసం మొత్తం 328 ఆఫీసులను రాష్ట్రం ఏర్పడిన రోజైన జూన్ 2న ప్రారంభించాలని నిర్ణయించారు.