సిద్దిపేట, జూన్ 3: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం సిద్దిపేటలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ మచ్చ విజితా వేణుగోపాల్రెడ్డి ఆధ్వర్యంలో రైతు దినోత్సవాన్ని వినూత్నంగా నిర్వహించారు. మార్కెట్ యార్డులో ధాన్యపు గింజలతో సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు చిత్రాలను ఆవిష్కరించారు. రైతు దినోత్సవంతోపాటు మంత్రి హరీశ్రావు పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు.
జొన్నలు, వడ్లు, పెసర్లు, బియ్యంతో నాగలి పట్టిన రైతు చిత్రాలను రూపొందించారు. మార్కెట్కు వచ్చిన రైతులు, హమాలీలు, నాయకుల సమక్షంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. భారీ కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు వంగ నాగిరెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ రాంచందర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.