పంచాయతీరాజ్, మున్సిపల్, రోడ్లు, భవనాలు, నీటిపారుదల శాఖల పరిధిలో అభివృద్ధి పనులు నిలిచిపోయి మౌలిక సదుపాయాల కల్పనకు ఆటంకం కలుగుతున్నది. ఎంతో మంది ఉపాధి కోల్పోతున్నరు. 9 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి నిరోధక ఎజెండాతో రాష్ర్టాన్ని అధోగతిపాలు చేస్తున్నది.
-హరీశ్
హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షంపై కక్షతో రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే కుట్రలకు పాల్పడటం దుర్మార్గమని మాజీ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. అభివృద్ధి కాంక్షను వదిలేసి, రాజకీయ కక్షతో ముందుకెళ్లడం సీఎం రేవంత్రెడ్డి దివాలాకోరు రాజకీయాలకు పరాకాష్ట అని ఆగ్రహం వ్యక్తంచేశారు. 33 జిల్లాల్లో రూ.10 వేల కోట్ల విలువచేసే 34,511 స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ (ఎస్డీఎఫ్) పనులను రద్దు చేయడమే ఇందుకు నిదర్శనమని ఉదహరించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో సర్కార్ తీరును తూర్పారబట్టారు.
ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా మంజూరైన అనేక పనులను ప్రభుత్వం నిలిపివేసిందని, ఇప్పటికే ప్రారంభమైన అనేక పనులను తదుపరి ఉత్తర్వులు వచ్చేదాకా కొనసాగించొద్దని మధ్యంతరంగా నిలిపివేస్తూ ఆదేశాలిచ్చిందని, దాదాపు పూర్తి కావస్తున్న ప్రాజెక్టులకు సైతం బిల్లుల చెల్లింపులు ఆపేసిందని విమర్శించారు.
గ్రామంలో పంచాయతీరాజ్, మున్సిపల్, రోడ్లు, భవనాలు, నీటిపారుదల తదితర శాఖల పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులు నిలిచిపోయాయని తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పనకు ఆటంకం ఏర్పడిందని, ఎంతో మంది ఉపాధి కూడా కోల్పోతున్నారని వివరించారు. 9 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి నిరోధక ఎజెండాతో రాష్ర్టాన్ని అధోగతిపాలు చేస్తున్నదని మండిపడ్డారు.
గత ప్రభుత్వ ఆనవాళ్లు లేకుండా చేస్తానని కంకణం కట్టుకున్న సీఎం రేవంత్రెడ్డి, తన అనాలోచిత చర్యలతో తన ఆనవాళ్లనే ప్రజల్లో లేకుండా చేసుకుంటున్నరు
-హరీశ్
ఈ ప్రభుత్వానికి కొత్త పనులు చేపట్టే శక్తిసామర్థ్యాలు లేవని తేలిపోయిందని హరీశ్రావు ఎద్దేవాచేశారు. మంజూరైన పనులను పూర్తిచేసే కనీస నైతిక బాధ్యత కూడా ఈ సర్కారుకు లేదని తాజా పనుల రద్దుతో మరింత స్పష్టమైందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలన ప్రజలకు శాపంగా మారిందని, సీఎం రేవంత్రెడ్డి అభివృద్ధి నిరోధకుడిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
కేసీఆర్ ప్రభుత్వం గత ఆర్థిక సంవత్సరంలో నియోజకవర్గాలకు కేటాయించిన ఎస్డీఎఫ్ నిధులను కాంగ్రెస్ రాగానే రద్దు చేసిందని, ఆ నిధుల నుంచే మార్చిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు మాత్రమే రూ.10 కోట్ల చొప్పున మంజూరు చేసి తన కురచ బుద్ధిని, పక్షపాత వైఖరిని చాటుకున్నదని దుయ్యబట్టారు.
ప్రతిపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాలపై కక్షతో రూపాయి కూడా కేటాయించకపోగా ఉన్న పపనులకు సైతం నిధులు ఆపేసి రేవంత్ సర్కార్ దుర్మార్గానికి పాల్పడుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. రద్దు చేసిన ఎస్డీఎఫ్ పనులకు సంబంధించి సీఎం ఒక సమీక్ష కూడా పెట్టలేదని, కలెక్టర్లు, అధికారులు సైతం ఎలాంటి సమీక్ష చేయలేదని, వివిధ దశల్లో ఉన్న పనులపై ప్రభుత్వానికి నివేదికను కూడా ఇవ్వలేదని తెలిపారు.
గత ప్రభుత్వ ఆనవాళ్లు లేకుండా చేస్తానని కంకణం కట్టుకున్న సీఎం, తన అనాలోచిత చర్యలతో తన ఆనవాళ్లనే ప్రజల్లో లేకుండా చేసుకుంటున్నారని ఎద్దేవాచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా స్వార్థ పూరిత రాజకీయాలను పక్కనపెట్టి రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలని సూచించారు. గత ప్రభుత్వంలో మంజూరైన పనులను తక్షణమే పూర్తిచేయాలని డిమాండ్ చేశారు.