Minsiter Koppula Eshwar | విపక్షాల కుట్రలను తిప్పికొట్టాలని మంత్రి కొపుల ఈశ్వర్ పార్టీ కార్యకర్తలు, నేతలకు పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బొమ్మిరెడ్డిపల్లి మహేశ్వర గార్డెన్లో ఇన్చార్జి ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కార్యకర్తలు, ముఖ్యనేతలే పార్టీకి పట్టుగొమ్మలన్నారు. రానున్న ఎన్నికలకు కార్యకర్తలు సమాయత్తం కావాలన్నారు. పార్టీ బలోపేతంపై దృష్టి సారించాలన్నారు. తెలంగాణ కోసం ఉద్యమించి, విజయం సాధించామన్నారు. ఉద్యమ పార్టీకి ప్రజలు రెండుసార్లు అధికారం అప్పగించారన్నారు.
తెలంగాణ రాష్ట్రం దేశానికే రోల్ మోడల్గా నిలిచిందని మంత్రి కొప్పుల చెప్పారు. ప్రతీ కార్యకర్తను కదిలిస్తూ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు గ్రామాల్లో వివరించాలన్నారు. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని, అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. పార్టీ పటిష్టానికి పని చేసే కార్యకర్తలకు గుర్తింపు ఉంటుందన్నారు. అనంతరం మంత్రి జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం వెనుగుమట్ల, బొంకూర్ వేంకటేశ్వరస్వామి జాతర, బ్రహ్మోత్సవాలకు హాజరయ్యారు. స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించారు.