Congress Cabinet | హైదరాబాద్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ): శాసనసభ తొలి సమావేశాలు ముగిసిన నేపథ్యంలో అందరి దృష్టి ఇప్పుడు రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణపైకి మళ్లింది. మంత్రివర్గంలో మరో ఆరుగురికి అవకాశం కల్పించడానికి వీలుండటంతో ఆశావహులు ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. ఇపుడే విస్తరణ చేపడుతారా? లోక్సభ ఎన్నికల తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందా? అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే, పార్టీ కోసం పనిచేసిన వారంతా ఇప్పుడే పదవుల భర్తీ ప్రక్రియను పూర్తిచేస్తే బాగుంటుందన్న అభిప్రాయంతో ఉన్నారు. నామినేటెడ్ పదవులను కూడా ప్రకటించడంతోపాటు మంత్రివర్గ విస్తరణ చేస్తే రాబోయే లోక్సభ ఎన్నికలను, స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కోవడం పార్టీకి తేలిక అవుతుందని చెప్తున్నారు.
ఫిబ్రవరి రెండో వారంలోనే లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వస్తుందన్న ఊహాగానాల నేపథ్యంలో పదవుల పంపకంపై చర్చలు జోరందుకున్నాయి. మంత్రివర్గంలో చేరే ఆరుగురు అదృష్టవంతులు ఎవరన్నదానిపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. వర్గాలు, కులాలు, ప్రాంతాల సమీకరణపై ఆసక్తికరమైన విశ్లేషణలు కనిపిస్తున్నాయి. పదేండ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీకి అద్భుతమైన అవకాశం వచ్చిందని, ఇప్పుడు పదవి రాకపోతే ఇక ఎప్పటికీ రాదన్న ఆలోచనల్లో పలువురు సీనియర్లు ఉన్నట్టు సమాచారం. దీంతో అవకాశం దొరికిన ప్రతీ సందర్భంలో అధిష్ఠానాన్ని ప్రసన్నం చేసుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు.
పార్టీలో సీనియర్లుగా ఉంటూ పదవులు దక్కని ఎమ్మెల్యేలు ఈసారి విస్తరణలో తమకు ఖాయమని భావిస్తున్నారు. ప్రస్తుత మంత్రివర్గంలో ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాకు ప్రాతినిధ్యం లేదు. దీంతో ఆ జిల్లాల నుంచి గెలుపొందినవారు విస్తరణలో తమకు స్థానం ఖాయమన్న భావనతో ఉన్నారు. అధిష్ఠానంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ముగ్గురు సీనియర్లు మంత్రివర్గంలో స్థానం కోసం ప్రయత్నిస్తున్నారు. గడ్డం వివేక్, గడ్డం వినోద్ అధిష్ఠానంతో సన్నిహితంగా ఉంటూనే ఇక్కడ సీఎం రేవంత్రెడ్డిని కూడా ప్రసన్నం చేసుకొనే పనిలో ఉన్నారు. తామిద్దరిలో ఎవరికి మంత్రి పదవి ఇచ్చినా ఫర్వాలేదని చెప్తున్నారు. గతంలో గడ్డం వినోద్ మంత్రిగా చేశారు. ఈ సారి తనకు అవకాశం ఇస్తారని వివేక్ చెప్పుకొంటున్నట్టు ప్రచారం జరుగుతున్నది. వినోద్ కూడా పదవిపై ఆశతోనే ఉన్నారు.
మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు కూడా తనకు మంత్రి పదవి పక్కా అని తన అనుచరులకు చెప్తున్నట్టు సమాచారం. ఆయనకు అధిష్ఠానం వద్ద కూడా మంచి పట్టున్నది. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు కూడా మంత్రి వర్గంలో స్థానం లేదా ఏదైనా కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వాలని కోరుతున్నట్టు తెలిసింది. నిజామాబాద్ జిల్లా నుంచి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి మంత్రివర్గంలో స్థానం ఖాయమన్న ధీమాతో ఉన్నారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్రావు కూడా మంత్రివర్గంలో స్థానం ఆశిస్తున్నారు. మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ మంత్రివర్గంలో స్థానం ఖాయమని నమ్మకంగా ఉన్నారు. ఎమ్మెల్సీ పదవి ఇచ్చి తనను మంత్రివర్గంలోకి తీసుకొంటారని, ముస్లిం మైనార్టీ కోటాలో తనకు మంత్రి పదవి పక్కా అని చెప్పుకొంటున్నట్టు తెలిసింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కూడా షబ్బీర్ అలీ పట్ల సానుకూలంగా ఉన్నారని సమాచారం.
కాంగ్రెస్కు హైదరాబాద్లో ఒక్క ఎమ్మెల్యే కూడా లేకపోవడంతో ఎవరికి మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తారన్నది ఆసక్తిగా మారింది. ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయిన సీనియర్ నేతలు మధుయాష్కీగౌడ్, అంజన్కుమార్ యాదవ్, ఫిరోజ్ఖాన్, మైనంపల్లి హన్మంతరావు మంత్రివర్గంలో స్థానం ఆశిస్తున్నారు. పార్టీకి కూడా హైదరాబాద్ను నడిపించే మంత్రిలేక ఇబ్బందిగా ఉన్నది. పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హన్మంతరావు పేరును కూడా మంత్రివర్గంలో పరిశీలించాలన్న డిమాండ్ ఉన్నది. హన్మంతరావు అంటేనే హైదరాబాద్ కాంగ్రెస్ అన్న పేరున్నది. ఏఐసీసీ వర్గాల్లో కూడా ఆయనకు పట్టున్నది. రంగారెడ్డి నుంచి కూడా మంత్రిగా ఎవరికి అవకాశం ఇస్తారన్న చర్చ జరుగుతున్నది. ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డికి మంత్రి పదవి ఇవ్వడం ఖాయమన్న ప్రచారం జరుగుతున్నది. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే మనోహర్రెడ్డి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. మంత్రి పదవి దక్కని పక్షంలో వీరిలో ఇద్దరికి కనీసం కార్పొరేషన్ చైర్మన్ పదవులయినా ఇస్తారని జిల్లా కాంగ్రెస్లో ప్రచారం జరుగుతున్నది.