యాదాద్రి, మే 22 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో ఆదివారం భక్తుల కోలాహలం నెలకొన్నది. స్వామివారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కొండపై క్యూ కాంప్లెక్స్, ప్రసాద విక్రయాశాల భక్తుల రద్దీతో కిటకిటలాడాయి.
కొండకింద కల్యాణకట్ట, లక్ష్మీపుష్కరిణిలో భక్తుల సందడి కొనసాగింది. స్వామివారికి నిత్యపూజలు తెల్లవారు జాము మూడున్నర గంటల నుంచి మొదలయ్యాయి. ప్రధానాలయంలో పాటు పాతగుట్ట ఆలయంలో ఉదయం నుంచి రాత్రి వరకు నిరాటంకంగా దర్శనాలు కొనసాగాయి.
అన్ని విభాగాలు కలుపుకొని స్వామివారి ఖాజానాకు రూ.33,81,486 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈఓ ఎన్. గీత తెలిపారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయంతో పాటు అనుబంధ పాతగుట్ట గుండం ఆంజనేయస్వామి వద్ద ఈ నెల 25న హనుమాన్ జయంతి నిర్వహించనున్నట్లు ఈఓ వెల్లడించారు.