హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): గురుకుల విద్యార్థి ఫుడ్ పాయిజన్తో చనిపోవడం చాలా బాధాకరమని బీఆర్ఎస్ నేత, రాష్ట్ర గురుకుల విద్యాలయాల సంస్థ మాజీ కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 9న భువనగిరి సంక్షేమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగితే ఐదు రోజుల వరకు ఉపాధ్యాయులు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థి చనిపోయే ముందు రోజు ఓ ప్రైవేట్ దవాఖానకు తీసుకెళ్లడం దారుణమని మండిపడ్డారు.
గురువారం తెలంగాణ భవన్ ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడారు. భువనగిరి గురుకుల విద్యార్థి మరణం తనను తీవ్రంగా కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్య, సంక్షేమ శాఖలు రెండూ సీఎం దగ్గరే ఉన్నా ఇప్పటి వరకు విద్యార్థుల మరణాలపై సమీక్షించలేదని విమర్శించారు. గురుకులాల్లో చేరేది పేద, మధ్యతరగతి, బడుగు, బలహీన వర్గాల పిల్లలేనని, ఇంటి వద్ద సరైన సౌకర్యాలు లేనివాళ్లేననే విషయాన్ని ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు.
ఎంతోభవిష్యత్తు ఉన్న విద్యార్థులు ఇలా చనిపోవడం హృదయ విదారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ఘటన చూసి మిగతా విద్యార్థులు కూడా ఖాళీ చేసి ఇళ్లకు వెళ్లిపోయారని తెలిపారు. దీనిపై చిన్నస్థాయి వాళ్లను బాధ్యులుగా చేసి చర్యలు తీసుకుంటే లాభం లేదని, ఇలాంటి వరుస ఘటనలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.