Indonesia Earthquake | ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. తూర్పు ఇండోనేషియాలోని ఫ్లోరెస్ దీవి సమీపంలో శనివారం తెల్లవారుజామున 7.7 తీవ్రతతో సంభవించిన భూకంపం తీవ్ర భయాందోళనకు గురిచేసింది. భూకంపం ధాటికి పలు భవనాలు దెబ్బతినగా.. ఇద్దరు మృతి చెందినట్లు అధికారులు ప్రాథమికంగా వెల్లడించారు. బలమైన ప్రకంపనల నేపథ్యంలో కొద్దిసేపు సునామీ హెచ్చరిక జారీ చేయడంతో వందలాది మంది ప్రజలు ఎత్తైన ప్రాంతాలకు పరుగులు తీశారు.
అమెరికా జియోలాజికల్ సర్వే (USGS) ప్రకారం.. ఫ్లోరెస్ దీవి ఉత్తర తీరానికి సమీపంలో భూకంప కేంద్రం నమోదైంది. ఎండె నగరానికి వాయువ్యంగా సుమారు 68 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. భూకంపం చాలా తక్కువ లోతులో సంభవించడంతో ప్రకంపనలు తీవ్రంగా కనిపించాయి. అనంతరం అదే ప్రాంతంలో 6.1 తీవ్రతతో సహా పలు ప్రకంపనలు నమోదయ్యాయి.
భూకంపం కారణంగా పలు భవనాలు దెబ్బతిన్నాయి. ఆసుపత్రుల్లోని రోగులు సైతం భయంతో బయటకు పరుగులు తీశారు. కొన్ని భవనాల గోడలకు పగుళ్లు ఏర్పడినట్లు స్థానికులు తెలిపారు.
భూకంపం అనంతరం ఇండోనేషియా వాతావరణ, వాతావరణ శాస్త్ర, భూభౌతిక సంస్థ (BMKG) సునామీ హెచ్చరిక జారీ చేసింది. 0.5 మీటర్ నుంచి 3 మీటర్ల వరకు అలలు వచ్చే అవకాశం ఉందని అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు.
తూర్పు నుసా తెంగారా, దక్షిణ సులవేసి, పశ్చిమ నుసా తెంగారా ప్రాంతాలకు సునామీ ముప్పు ఉండొచ్చని హెచ్చరించారు. దీంతో ఫ్లోరెస్ దీవిలోని మౌమెరె సహా పలు ప్రాంతాల్లో ప్రజలు ఎత్తైన ప్రదేశాలకు తరలివెళ్లారు. సముద్రం వెనక్కి వెళ్లిన దృశ్యాలు కూడా కనిపించినట్లు స్థానికులు తెలిపారు. అయితే కొద్దిసేపటి తర్వాత సునామీ హెచ్చరికను ఉపసంహరించారు.
భూకంపం కారణంగా ఇప్పటివరకు ఒక పురుషుడు, ఒక మహిళ మృతి చెందినట్లు విపత్తు నిర్వహణ అధికారులు వెల్లడించారు. మృతుల సంఖ్య, భవనాలకు జరిగిన నష్టం తదితర వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.