Telangana | హైదరాబాద్, మే 18(నమస్తే తెలంగాణ): సన్నబియ్యం కొనుగోలు వ్యవహారంలో భారీగా అక్రమాలకు తెరలేచినట్టు పౌరసరఫరాల సంస్థలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. సన్న ధాన్యం టెండర్ల వెనుక గూడుపుఠాణీ జరిగినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ప్రతిపక్షాలు కూడా గ్లోబల్ టెండర్ల మాటున భారీ కుంభకోణానికి తెరతీశారంటూ తీవ్రమైన ఆరోపణలు గుప్పిస్తున్నాయి. బహిరంగ మార్కెట్లో తక్కువ ధరకే లభించే అవకాశం ఉన్నప్పటికీ గ్లోబల్ టెండర్ల పేరుతో ఎక్కువ ధరకు కొనడం వెనుక మతలబు ఏంటని బీఆర్ఎస్, బీజేపీ ప్రశ్నిస్తున్నాయి.
పౌరసరఫరాల సంస్థ వద్ద ఉన్న సన్న వడ్లను అగ్గువకే అమ్మి.. ఇప్పుడు అధిక ధరకు బియ్యం కొనుగోలు చేయడం వెనుక మతలబు ఏమిటని నిలదీస్తున్నాయి. ధాన్యం కొనుగోలు చేసిన సంస్థలకే సన్న బియ్యం సరఫరా చేసే టెండర్లు కట్టబెట్టడం వెనుక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పౌరసరఫరాల సంస్థ నిర్ణయాల వల్ల ప్రభుత్వానికి రూ.530 కోట్ల నష్టం వాటిల్లే అవకాశం ఉన్నదని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఆరోపిస్తుండగా.. మొత్తం కుంభకోణాన్ని త్వరలోనే బయటపెడతానని బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వానికి కలుగుతున్న ఈ నష్టం.. ఎవరికి లాభం చేకూర్చుతున్నదో చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
గురుకులాలు, అంగన్వాడీలు, మధ్యహ్న భోజన పథకానికి సన్నబియ్యం సరఫరా కోసం ఇటీవల పౌరసరఫరాల సంస్థ గ్లోబల్ టెండర్లను ఆహ్వానించింది. ఈ టెండర్లు ద్వారా 2.20 లక్షల టన్నుల సన్నబియ్యం సేకరించాలని నిర్ణయించింది. నాలుగు సంస్థలు టెండర్ దాఖలు చేసినట్టు తెలిసింది. సదరు సంస్థలు కిలో రూ.57 వరకు ధర కోడ్ చేసినట్టు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. బహిరంగ మార్కెట్లో ప్రస్తుతం సన్న బియ్యం రూ. 42-45 వరకు లభించే అవకాశం ఉంది (ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేస్తుంది కాబట్టి తక్కువ ధరకు వస్తాయి). మిల్లర్లు కూడా ఇదే ధరకు సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. అయినప్పటికీ ఇటు బహిరంగ మార్కెట్ ధరను, మిల్లర్లను పక్కనపెట్టి కిలో రూ.57కు కొనుగోలుకు సిద్ధమవడం ఏమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ లెక్కన కిలోకు సుమారు రూ.15 చొప్పున టన్నుకు రూ. 15వేలు అదనంగా చెల్లిస్తున్నారు. పౌరసరఫరాల సంస్థ 2.20 లక్షల టన్నులు సేకరించనున్న నేపథ్యంలో రూ.330 కోట్లు అదనంగా చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ 330 కోట్లు ఎవరి జేబులోకి వెళ్తున్నాయో చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి.
మూడు నెలల క్రితం పౌరసరఫరాల సంస్థ ధాన్యం విక్రయించేందుకు గ్లోబల్ టెండర్లను ఆహ్వానించింది. ఈ టెండర్లలో పాల్గొన్న కేంద్రీయ భండార్, హిందుస్థాన్ ఎంటర్ప్రైజెస్, నాకాఫ్తో పాటు మంచుకొండ ఆగ్రోటెక్ సంస్థలు ధాన్యం టెండర్లను దక్కించుకున్నాయి. కేంద్రీయ భండార్, హిందుస్థాన్ ఎంటర్ప్రైజెస్తోపాటు మరొక సంస్థ ఇప్పుడు సన్న బియ్యం టెండర్లను కూడా దక్కించుకున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. టెండర్లలో దక్కించుకున్న ధాన్యాన్ని నిబంధనల ప్రకారం 60 రోజుల్లో మిల్లుల నుంచి ఖాళీ చేయాలి. మరో వారం గడిస్తే ఆ గడువు పూర్తికానుంది. కానీ ఇప్పటికి కేవలం 20 శాతం ధాన్యాన్ని మాత్రమే ఆయా సంస్థలు ఖాళీ చేశాయి. అవి ధాన్యం ఎత్తితేనే ప్రభుత్వానికి డబ్బులు వస్తాయి. లేనిపక్షంలో వడ్డీ కూడా ప్రభుత్వం నష్టపోనుంది. ఇలాంటి కంపెనీలకే మళ్లీ సన్నబియ్యం టెండర్లు కట్టబెట్టడం ఏమిటని, దీని వెనుక మతలబు ఏమిటని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. అంటే సదరు సంస్థలు, అధికారులు, ప్రభుత్వ పెద్దలు కలిసి కుమ్మక్కయ్యారా అంటూ నిలదీస్తున్నాయి.
ఎవరైనా సన్న వడ్లను, సన్న బియ్యాన్ని దాచుకొని వాడుకుంటారు. వాటి విలువ అలాంటిది. పౌరసరఫరాల సంస్థకు మాత్రం సన్న వడ్ల విలువ తెలియడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దాచుకొని వాడుకోవాల్సిన సన్న వడ్లను అగ్గువ ధరకే అమ్మేసి.. ఇప్పుడు అధిక ధరకు సన్న బియ్యం కొనుగోలు చేస్తున్నది. సన్నబియ్యం టెండర్లపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో పౌరసరఫరాల సంస్థ చేసిన మరో నిర్వాకం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మూడు నెలల క్రితం పౌరసరఫరాల సంస్థ 35 లక్షల టన్నుల ధాన్యాన్ని విక్రయించింది. ఇందులో 1.59 లక్షల టన్నుల సన్న ధాన్యం కూడా ఉంది. ఈ ధాన్యాన్ని గన్నీ, మార్కెట్ ఫీజు కాకుండా కిలో రూ. 22.59 చొప్పున విక్రయించింది. ఈ ధాన్యాన్ని విక్రయించకుండా మిల్లర్లకు ఇచ్చి వారి నుంచి సన్న బియ్యం తీసుకోవచ్చు.
తద్వారా సుమారు లక్ష టన్నుల సన్న బియ్యం వచ్చే అవకాశం ఉంది. ఈ లక్ష టన్నులు పోగా.. మిగిలిన అవసరాలకు టెండర్లు పిలిస్తే సరిపోయేది. కానీ పౌరసరఫరాల సంస్థ మాత్రం చేతిలో ఉన్న ధాన్యం అమ్ముకొని కొత్తగా సన్నబియ్యం కోసం టెండర్లు పిలవడంపై ప్రతిపక్షాలు నిప్పులు చెరుగుతున్నాయి. సన్న వడ్లను బియ్యంగా మార్చితే ప్రభుత్వానికి కిలోకి రూ. 37 వరకు మాత్రమే ఖర్చు అయ్యేది. కానీ కిలోకి రూ. 57 చొప్పున వెచ్చించి కొనుగోలు చేయడంతో కిలోకు రూ. 20 వరకు నష్టం వాటిల్లుతున్నది. ఈ లెక్కన లక్ష టన్నులకు రూ. 200 కోట్లు ప్రభుత్వం నష్టపోయిందనే వాదన వినిపిస్తున్నది. ఇది యాదృచ్చికంగా జరిగిందా లేక పక్కా ప్రణాళిక ప్రకారమే జరిగిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సన్న బియ్యం టెండర్లను పౌరసరఫరాల సంస్థ అత్యంత రహస్యంగా నిర్వహిస్తున్నది. ఇందుకు సంబంధించి ఏ చిన్న విషయం కూడా బయటకు వెళ్లకుండా జాగ్రత్తపడుతున్నది. మొత్తం టెండర్ ప్రక్రియలో అధికారులను పూర్తిగా పక్కకు పెట్టినట్టు తెలిసింది. ప్రత్యేకమైన అధికారులతో ఈ వ్యవహారాన్ని నిర్వహిస్తున్నారని విశ్వసనీయ సమాచారం. ఈ టెండర్లకు సంబంధించి వ్యవహారం మొత్తం సచివాలయం నుంచి సాగిస్తున్నట్టు చెప్తున్నారు. దీనిపై సివిల్ సైప్లె ఉద్యోగులు కూడా ఆందోళనలో ఉన్నట్టు తెలిసింది. ఇది ఎక్కడికి వెళ్లి ఎవరి మెడకు చుట్టుకుంటుందోననే భయం పట్టుకున్నట్టు చర్చ జరుగుతున్నది.
పేద విద్యార్థులకు కడుపునిండా భోజనం పెట్టాలని సంకల్పించిన నాటి సీఎం కేసీఆర్ గురుకులాల్లో, మధ్యాహ్న భోజనంలో, అంగన్వాడీలకు సన్న బియ్యం పంపిణీ చేయాలని ఆదేశించారు. సన్న బియ్యం పంపిణీతో పౌరసరఫరాల సంస్థపై ఆర్థికంగా భారం పడకుండా నాటి అధికారులు చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వం కొనుగోలు చేసే దానిలో వచ్చే సన్న ధాన్యాన్ని సీఎంఆర్ కింద ఎఫ్సీఐకి ఇవ్వకుండా రాష్ట్ర కోటా కింద సన్న బియ్యం తీసుకునేది. ఆ బియ్యాన్ని గురుకులాలు, ఇతర సంస్థలకు సరఫరా చేసేది. ఒకవేళ సన్న ధాన్యం తక్కువగా వస్తే దొడ్డు ధాన్యాన్ని మిల్లర్లకు ఇచ్చి క్వింటాలుకు రూ.140 చొప్పున చెల్లించి సన్న ధాన్యం తీసుకునేది. ఈ లెక్కన కిలోకు రూ. 1.4 పైసలు ధర పడేది. ఈ విధంగా గత ప్రభుత్వం సన్న ధాన్యం కొనుగోలు పేరుతో ఏనాడూ సంస్థపై భారం పడకుండా జాగ్రత్తలు తీసుకున్నది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఐదు నెలలు కాకముందే సన్న బియ్యం కోసం టెండర్లు పిలిచి సంస్థపై ఆర్థిక భారాన్ని మోపుతున్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.