Weather Update | హైదరాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ): బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో చలి తీవ్రత కొనసాగుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు 6.5 డిగ్రీల నుంచి 16.3 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. ఉదయం వేళ మంచు కురుస్తుండగా, మధ్యాహ్న సమయంలో ఒకవైపు ఎండలు, మరోవైపు చలిగాలులు వీస్తున్నాయి. కనిష్ఠ ఉష్ణోగ్రతలు మరో వారంపాటు కొనసాగే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొన్నది.
కుమ్రంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, సంగారెడ్డి, నిర్మల్, రంగారెడ్డి జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యూ)లో 6.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్ జిల్లా బేలాలో 8 డిగ్రీలు, సంగారెడ్డి జిల్లా కోహిర్లో 8.9, నిర్మల్ జిల్లా పెంబీలో 9.3, రంగారెడ్డి జిల్లా మొహినాబాద్లో 9.4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఇతర జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 10.5 డిగ్రీల నుంచి 16.3 డిగ్రీలుగా నమోదయ్యాయి. జోగులాంబ గద్వాల జిల్లా మినహా అన్ని జిల్లాల్లో 15 డిగ్రీలలోపు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ఆయా జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసినట్టు వాతావరణ శాఖ తెలిపింది.