CM KCR | కరీంనగర్, మార్చి 23 (నమస్తే తెలంగాణ): ‘మీరే సార్.. మా ధైర్యం. మమ్మల్ని ఆదుకోండి సార్..’ అని కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్కు చెందిన తర్బూజ రైతు ద్యావ రాంచంద్రారెడ్డి సీఎం కేసీఆర్ను వేడుకున్నారు. గురువారం జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి నేరుగా రైతు రామచంద్రారెడ్డి క్షేత్రానికి చేరుకుని వడగళ్లతో నష్టపోయిన తర్బూజ పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయనను సీఎం కేసీఆర్ కొన్ని ప్రశ్నలు అడిగారు. ఎప్పటి నుంచి సాగు చేస్తున్నారు? ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారు? కల్టివేషన్ ఎలా చేస్తారు? మార్కెటింగ్ సదుపాయాలు ఎలా ఉన్నాయి? అంటూ సీఎం ఆరా తీశారు. తాను ప్రతి సంవత్సరం పది ఎకరాల్లో తర్బూజ పంటను సాగు చేస్తానని, ఢిల్లీలో మార్కెటింగ్ చేస్తానని రామచంద్రారెడ్డి చెప్పారు. ఒక లారీ (సుమారు 12 టన్నులు) దిగుబడికి రూ.6 లక్షల నుంచి రూ.7 లక్షలు వస్తాయని చెప్పారు. వెంటనే కేసీఆర్ కలుగజేసుకుని కిలో 60 వరకు వస్తుందని లెక్కవేసి చెప్పారు. ఇప్పుడు ఎన్ని ఎకరాల్లో పంట దెబ్బతిన్నదని అడిగారు.
మొత్తం 10 ఎకరాల్లో తర్బూజాతోపాటు డ్రాగన్ఫ్రూట్ కూడా దెబ్బతిన్నదని రాంచంద్రారెడ్డి చెప్పడంతో ఆ పంటను కూడా సీఎం కేసీఆర్ పరిశీలించారు. రాళ్లతో దెబ్బతిన్న డ్రాగన్ఫ్రూట్ రెబ్బలను పరిశీలించి ఈ ఏడాది అక్కరకు రాదని, కాత రాదని సీఎం కేసీఆరే చెప్పారు. ఈ సందర్భంగా రైతు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. గతంలో పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టి పది, పదిహేను బోర్లు వేసినా ఫలితం లేకుండా పోయిందనీ, ఇప్పుడు 8 నుంచి 10 మీటర్ల లోపే బోర్లలో నీరు పుషలంగా లభిస్తున్నదని, కరెంటు విషయంలో ఎలాంటి సమస్యా లేదని సీఎం దృష్టికి తెచ్చారు. అటు తర్వాత పకనే ఉన్న పొట్టకొచ్చిన వరి పంటను సీఎం పరిశీలించారు. సాగు పద్ధతులు, పంట నష్టం వివరాలను తెలుసుకున్నారు.
ద్యావ రామచంద్రారెడ్డి పంటలను పరిశీలించిన అనంతరం సీఎం కేసీఆర్ సమీపంలోని మామిడి రైతు ఎడవెల్లి రాజిరెడ్డి తోటకు చేరుకున్నారు. వడగళ్ల వానకు రాలిపోయిన మామిడి కాయలను పరిశీలిస్తూ పంటనష్టం వివరాలు తెలుసుకున్నారు. ఎరువుల వాడకం, సేద్యం తీరుతెన్నుల గురించి కాసేపు రైతులతో చర్చించారు. తెలంగాణ ప్రభుత్వం రైతు ప్రభుత్వమని, రైతుల కోసం ఎన్నో మంచి కార్యక్రమాలు చేపడుతున్నామని, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు కాస్త ధైర్యంగా ఉండాలని రైతు రాజిరెడ్డికి ధైర్యం చెప్పారు. అక్కడే ఉన్న తోట కౌలుదారు రైతు మహేశ్ భార్య సత్తమ్మ ముఖ్యమంత్రితో మాట్లాడుతూ.. ‘సార్.. మేము నాలుగు తోటలు పట్టుకున్నం.
ఈ తోటనే బాగా కాసింది. రాళ్ల వానతో మొత్తం నాశనమైంది. మాకు ఇల్లు కూడా లేదు సారు’ అని మొరపెట్టుకున్నది. దీంతో స్పందించిన సీఎం కేసీఆర్ వెంటనే వీరికి డబుల్బెడ్రూం ఇల్లు మంజూరు చేయాలని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ను ఆదేశించారు. చొప్పదండి మండలం రుక్మాపూర్కు చెందిన సత్తమ్మ దంపతులు ఈ సందర్భంగా కేసీఆర్కు దండంపెడుతూ.. ‘సారు మీరు దయామయులు’ అని సంతోషం వ్యక్తంచేశారు. నష్టపోయిన రైతులను, కౌలుదారులను సమన్వయపరిచి నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని చీఫ్ సెక్రటరీ శాంతికుమారి, కలెక్టర్ ఆర్వీ కర్ణన్ను రైతుల సమక్షంలోనే సీఎం కేసీఆర్ ఆదేశించారు.
చొప్పదండి మండలం వెదురుగట్టకు చెందిన రైతు వెంకటరమణారెడ్డితో సీఎం కేసీఆర్ కొద్దిసేపు మాట్లాడారు. తాను వేసిన మక్క పూర్తిగా దెబ్బతిన్నదని వెంకటరమణారెడ్డి చెప్పుకున్నారు. ‘మీరు వస్తున్నారంటే రైతులు ఎంతో సంతోషంగా ఉన్నరు. మీరంటే మాకెంతో నమ్మకం సార్. ఎకరానికి పది వేలు ప్రకటించి మా నమ్మకాన్ని మరింత పెంచారు సార్..’ అని సీఎంకు వివరించారు. వెంకటరమణారెడ్డి మాటలను ఆసక్తిగా విన్న ముఖ్యమంత్రి.. ‘చాలామంది నష్టపోయారు. ఇలాంటి సమయంలో ధైర్యంగా ఉండాలి. ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుంద’ని భరోసా ఇచ్చారు.
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ రైతుల కోరిక మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ వారితో ఫొటో దిగారు. మడుగు, గంగాధర, చొప్పదండి మండలాలకు చెందిన 15 మంది రైతులు ద్యావ రామచంద్రారెడ్డి వ్యవసాయ క్షేత్రంలో ముఖ్యమంత్రిని కలిశారు. ఈ సందర్భంగా ఆయా రైతులతో సీఎం కేసీఆర్ ముచ్చటించారు. ‘సార్.. మీ దయతోనే మేము ఏడాదికి రెండు పంటలు పండించుకుంటున్నాం. ఈసారి వడగళ్లు కురిసి నష్టపోయాం. అయినా మాకు భయం లేదు. మీరు ఉన్నారనే ధైర్యం ఉన్నది సార్..’ అంటూ చొప్పదండి మండలం మంగళపల్లికి చెందిన ఏనుగు స్వామిరెడ్డి, వెల్మ జగన్రెడ్డి, రామడుగు మండలానికి చెందిన బడుగు చంద్రయ్య, చొప్పదండి మండలం వెదురుగట్టకు చెందిన వెంకటరమణారెడ్డి, తదితర రైతులు సీఎం కేసీఆర్కు చెప్పుకున్నారు.
పంటలను పరిశీలించి, తమ యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్న అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ అక్కడి నుంచి బయలుదేరుతుండగా.. ‘సార్ మీతో ఒక్క ఫొటో దిగుతాం..’ అని రైతులు కోరడంతో ముఖ్యమంత్రి వారితో ఫొటో దిగారు. దీంతో రైతులు సంతోషించారు. అనంతరం జిల్లాలో జరిగిన పంట నష్టానికి సంబంధించి అధికారులు అక్కడే ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ను ముఖ్యమంత్రి పరిశీలించారు. నష్టం అపారంగానే ఉన్నదని, ప్రతి రైతుకు పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ను ఆదేశించారు.