హైదరాబాద్, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీ కార్మికులకు కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ మంగళవారం చేపట్టనున్న ‘చలో సెక్రటేరియట్’ కార్యక్రమాన్ని ప్రభుత్వం అడ్డుకుంటే.. బస్సులను రోడ్లపైనే నిలివేస్తామని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ హెచ్చరించింది. భారీ నిరసన కార్యక్రమానికి అన్ని డిపోల నుంచి కార్మికులు వేలాదిగా తరలిరావాలని పిలుపునిచ్చింది. ఈ మేరకు సోమవారం జేఏసీ నేతలు ఓ ప్రకటన విడుదల చేశారు. అమ్మలాంటి ఆర్టీసీ సంస్థను రక్షించుకోవడానికే ‘చలో సెక్రటేరియట్’ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ‘ఇది మా ఆత్మగౌరవ పోరాటం. మా ఆకలి పోరాటం. మా బతుకు పోరాటం. మా హకుల కోసం పోరాటం. దీన్ని దయచేసి అడ్డుకోవద్దు’ అంటూ కాంగ్రెస్ ప్రభుత్వానికి, పోలీసుశాఖకు విజ్ఞప్తి చేశారు.
తాము శాంతియుతంగా, గాంధేయ మార్గంలో పోరాటం తలపెట్టామని చెప్పారు. ఇప్పటికే కార్మికవర్గమంతా హైదరాబాద్కు చేరుకున్నారని, చలో సెక్రటేరియట్ను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఎకడి బస్సులు అకడే నిలిపివేసి విధులను మూకుమ్మడిగా బహిషరిస్తామని తెలిపారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయడానికి గత ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించడమే కాకుండా, గవర్నర్ ఆమోదంతో గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చినా నేటికీ అపాయింటెడ్ డే ప్రకటించకపోవడం, బకాయిలు చెల్లించకపోవడం అత్యంత దారుణమని మండిపడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఆర్టీసీలో కార్మిక సంఘాలను పునరుద్ధరిస్తామని చెప్పి తీవ్రంగా మోసగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మిక సంఘాలు ఇచ్చిన ‘చలో సెక్రటేరియెట్’ పిలుపుతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే రాష్ట్రంలోని వివిధ ఆర్టీసీ డిపోల్లో కార్మికులను ముందస్తు అరెస్టు చేసేందుకు సిద్ధపడగా.. సెక్రటేరియట్ పరిసరాలను పోలీసుశాఖ తమ ఆధీనంలోకి తీసుకోనున్నది. ఇందిరాపార్క్ వద్దనే పోలీసులతో భారీగా మోహరించి.. ఆ రూట్లను మూసివేసే ప్రణాళికలను పోలీసులు సిద్ధం చేసుకున్నారు.
ఆర్టీసీ ఉద్యోగులు నిరసనలు విరమించుకోవాలని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. ప్రజా పాలన ప్రభుత్వంలో ఆర్టీసీ సంస్థ పరిరక్షణ, ఉద్యోగుల సంక్షేమం, ప్రయాణీకుల భద్రత లక్ష్యంగా ముందుకు వెళ్తున్నదని చెప్పారు. ఆర్టీసీ ఉద్యోగుల డిమాండ్ల విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉన్నదని, కార్మికులు ఎవరూ ఎలాంటి నిరసనలూ తెలుపవద్దని విజ్ఞప్తి చేశారు. మహాలక్ష్మీ పథకం ద్వారా ఆర్టీసీకి రావాల్సిన నిధులు ప్రభుత్వం ఎప్పటికప్పుడు విడుదల చేస్తున్నదని పేర్కొన్నారు. ఆర్టీసీలో 3,038 ఉద్యోగాలకు అనుమతి ఇచ్చామని, 2,646 కొత్త బస్సులు కొనుగోలు చేశామని వివరించారు. నిరసనలు విరమించుకోవాలని, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆర్టీసీ ఉద్యోగులకు విజ్ఞప్తి చేశారు.