హైదరాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టులకు ఎంపికైన పలువురు రాజీనామాలు చేశారు. వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు కూడా అదేబాట పట్టారు. తమ రాజీనామా లేఖలను సోమవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి పంపించారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ సర్కారు నామినేటెడ్ పోస్టుల్లో పలువురిని నియమించింది.
కాంగ్రెస్ నేతృత్వంలో రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పాటవుతున్న నేపథ్యంలో నామినేటెడ్ పోస్టులకు, పలు కార్పొరేషన్ల చైర్మన్ పదవులకు వారు రాజీనామాలు చేశారు. తెలంగాణ పునర్నిర్మాణంలో తమకు అవకాశం కల్పించిన కేసీఆర్కు ఈ సందర్భంగా వారు కృతజ్ఞతలు తెలియజేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలకు అనుగుణంగా రానున్న రోజుల్లో పని చేస్తామని ప్రకటించారు.