హైదరాబాద్, మార్చి 27 (నమస్తే తెలంగాణ): రాష్ర్టానికి ఒక్క మెడికల్ కాలేజీ కూడా మంజూరు చేయకుం డా మోసం చేసిన కేంద్ర ప్రభుత్వం.. ఉల్టా బురద జల్లుతూనే ఉన్నది. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ (సీఎస్ఎస్) కింద మెడికల్ కాలేజీల మంజూరు కోసం తెలంగాణ ఎలాంటి దరఖాస్తులు చేయలేదని తాజాగా మరోసారి సమాధానం ఇచ్చింది. ఆర్టీఐ కార్యకర్త ఇనగంటి రవికుమార్ చేసిన దరఖాస్తుకు కేంద్రం సమాధానం ఇచ్చింది.
సీఎస్ఎస్ మొదటి మూడు దశల్లో కలిపి కేంద్రం 157 మెడికల్ కాలేజీలు మంజూరు చేసినట్టు చెప్పింది. తెలంగాణ నుంచి దరఖాస్తులు రాలేదని స్పష్టంచేసింది. తెలంగాణకు 8 మెడికల్ కాలేజీలు ఇచ్చామని కిషన్రెడ్డి ఓ సందర్భంలో చెప్పిన సంగతి తెలిసిం దే. కేవలం 2 జిల్లాల నుంచి దరఖాస్తులు వచ్చాయని, వాటిని తిరస్కరించామని ఇటీవల నిర్మలా సీతారామన్ చెప్పారు. ఇప్పుడు కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వ శాఖ ఎలాంటి ప్రతిపాదనలు రాలేదని చెప్పడం గమనార్హం.