హైదరాబాద్, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ): ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా రాష్ర్టాలను అస్థిరపరుస్తున్నది. న్యాయబద్ధంగా రాష్ర్టాలకు రావాల్సిన పన్నులను క్రమంగా తగ్గిస్తూ సెస్సులు, సర్చార్జీల రూపంలో దొడ్డిదారిన కేంద్ర ఖజానాకు తరలించుకుపోతున్నది. పేదల బతుకులు మారుస్తామంటూ అధికారంలోకి వచ్చి సామాన్యులపై అదనపు పన్నులు మోపుతున్న మోదీ సర్కార్.. గత ఆరేండ్లలో సెస్సులు, సర్చార్జీలను ఏకంగా 133% శాతం పెంచేసింది. ఈ విషయాన్ని పార్లమెంట్ సాక్షిగా కేంద్రమే అంగీకరించింది.
ప్రస్తుతం బడ్జెట్ సమావేశాల సందర్భంగా లోక్సభలో లేవనెత్తిన ఓ ప్రశ్నకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఇచ్చిన సమాధానం.. సెస్సులు, సర్చార్జీల రూపంలో ప్రజలకు కేంద్రం పెడుతున్న వాతలను, రాష్ర్టాల ఆదాయానికి భారీగా గండికొడుతున్న తీరును కండ్లకు కడుతున్నది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో రూ.2,18,553 కోట్లుగా ఉన్న సెస్సులు, సర్చార్జీలు 2021-22లో ఏకంగా రూ.4,81,217 కోట్లకు పెంచుకున్న కేంద్రం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23)లో ఈ ఏడాది జనవరి వరకు రూ.5,10,549 కోట్లు వసూలు చేసింది.
ప్రజలు చెల్లించే అన్ని పన్నులకు అదనంగా కేంద్రం వసూలు చేసే ప్రత్యేక పన్నునే సెస్ అంటారు. విద్య, వైద్యం, వ్యవసాయం, పెట్రోలియం, రహదారులు, మౌలిక సదుపాయాలు, ఎగుమతులు తదతర రంగాల్లో కేంద్రం సెస్సులను వసూలు చేస్తున్నది. పన్నుల రూపంలో కేంద్రానికి వచ్చే రాబడిలో రాష్ర్టాలకు వాటా ఇవ్వాల్సి ఉంటుంది. సెస్సుల్లో మాత్రం ఎలాంటి వాటా ఇవ్వాల్సిన అవసరం లేదు. అందుకే వివిధ రకాల పన్నులను మోదీ సర్కార్ క్రమంగా సెస్సుల రూపంలోకి మారుస్తున్నది.
రాష్ర్టాల ఆదాయానికి గండి
రాష్ర్టాల ఆదాయానికి అడ్డగోలుగా గండి కొడుతున్న మోదీ సర్కార్.. ఆ నిధులను సెస్సులు, సర్చార్జీల రూపంలో తన ఖజానాకు మళ్లించుకొంటున్నది. ఇటీవల లీటర్ పెట్రోల్పై రూ.2.50, డీజిల్పై రూ.4 చొప్పున పన్ను తగ్గించిన కేంద్రం.. ఆ మేరకు సెస్సులు పెంచింది. దీంతో కొత్తగా నిర్ణయించిన 41% వాటా ప్రకారం రాష్ట్రాలకు లీటర్ పెట్రోల్పై రూ.1.03, డీజిల్పై రూ.1.64 చొప్పున ఆదాయం తగ్గింది. ఆ సొమ్మంతా కేంద్రమే తరలించుకుపోయింది. 2017-2020 మధ్య కాలంలో కేంద్రం పెట్రోల్పై సెస్, సర్చార్జీలను 150%, డీజిల్పై 350% పెంచింది. 2017-18 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2022-23లో ఈ బాదుడు ఏకంగా 133% పెరిగింది