హైదరాబాద్, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ): జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దుచేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్ర బడ్జెట్లో కోత విధించడమే కాకుండా పనిదినాలను కూడా తగ్గించిందని, అనేక ఆంక్షలు పెట్టి నిధులు ఇవ్వడంలేదని దుయ్యబట్టారు. గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖపై శనివారం అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకులు ఒట్టి మాటలు కట్టి పెట్టి ఉపాధి హామీ పథకం కోసం పార్లమెంటు వద్ద ధర్నాలు చేయాలని సూచించారు. ఈ పథకాన్ని రక్షించుకునేందుకు అన్ని పార్టీలు కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు.
మిషన్ భగీరథ స్ఫూర్తితోనే బీఆర్ఎస్లో చేరా
గ్రామాల రూపురేఖలు మార్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని మంత్రి ఎర్రబెల్లి కొనియాడారు. మిషన్ భగీరథ పథకం స్ఫూర్తితోనే తాను బీఆర్ఎస్లో చేరినట్టు తెలిపారు. ఈ పథకంతో మంచినీటి సమస్య పూర్తిగా పరిష్కారమైందని చెప్పారు. పల్లెప్రగతితో గ్రామాలు కళకళలాడుతున్నాయని పేర్కొన్నారు. తండాలు, గూడేలను పంచాయతీలుగా మార్చడంతో 3,146 మంది ఎస్టీలు సర్పంచులు అయ్యారని వివరించారు.
ఊరికి వచ్చేవారు కాదు
తెలంగాణ రాకముందు ఊళ్లో కరెంటు, నీళ్లు ఉండేవికాదని, దుర్వాసన వచ్చేదని పేర్కొంటూ, తన మనువడు, మనువరాలు కూడా గ్రామానికి వచ్చేవారు కాదని మంత్రి ఎర్రబెల్లి చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత కరెంటు, నీటికి కొదవలేదని, ఊళ్లలో పారిశుద్ధ్య పనులు మెరుగుపడి దుర్వాసన రావడంలేదని పేర్కొన్నారు. దీంతో తమ మనువడు, మనువరాలు ఎప్పుడంటే అప్పుడు ఊరికి వస్తున్నారని తెలిపారు.
మా నాన్నను ఓడించింది కాంగ్రెస్
కాంగ్రెస్ సంస్కృతి మొదటి నుంచీ ఇలాగే ఉండేదని, గతంలో తన తండ్రి కాంగ్రెస్ తరఫున సమితి సర్పంచ్గా పోటీ చేస్తే తిరుగుబాటు అభ్యర్థిని నిలిపి ఆయనను ఓడించారని ఎర్రబెల్లి గుర్తుచేశారు. తన తండ్రికీ, తిరుగుబాటు అభ్యర్థికి సమానంగా ఓట్లు రావడంతో టాస్ వేశారని, అందులో తన తండ్రి ఓడిపోయాడని వివరించారు. అప్పటినుంచే తనకు కాంగ్రెస్ అంటే విరక్తి కలిగిందని తెలిపారు.
కోతుల పాపం కాంగ్రెస్దే
గ్రామాల్లో కోతుల బెడదకు కాంగ్రెస్దే బాధ్యతని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విమర్శించారు. అడవులను నరికి, పచ్చదనం అభివృద్ధి చేయకపోవడం వల్ల కోతులు ఊళ్లబాట పట్టాయని చెప్పారు. హరితహారం కార్యక్రమంతో గ్రామాలు చెట్లతో కళకళలాడుతున్నాయని, రాష్ట్రంలో గ్రీన్ కవర్ 7.7 శాతం పెరిగిందని చెప్పారు. గ్రామీణాభివృద్ధికి ఆర్థిక సంఘంలో కేంద్రం ఇస్తున్న నిధులకు సమానంగా తెలంగాణ ప్రభుత్వం నిధులు ఇస్తున్నదని, నేరుగా గ్రామ పంచాయతీల అకౌంట్కే డబ్బులు బదిలీ అవుతున్నాయని వివరించారు.
ఆసరా పెన్షన్లలో తెలంగాణ టాప్
ఆసరా పెన్షన్లలో తెలంగాణ దేశంలో అగ్రభాగాన నిలిచిందని ఎర్రబెల్లి తెలిపారు. రాష్ట్రంలో 44 లక్షల మందికి ఆసరా పింఛన్లు అందుతున్నాయని చెప్పారు. గతంలో ఆసరా పెన్షన్ల బడ్జెట్ కేవలం రూ.861 కోట్లు ఉంటే, నేడు రూ.12,000 కోట్లకు చేరిందని వివరించారు. కేంద్రం 6,60,000 మందికే పెన్షన్ ఇస్తున్నదని తెలిపారు.