Telangana Police | జూబ్లీహిల్స్, సెప్టెంబర్ 24: అత్యంత క్లిష్టమైన కేసులను సైతం ఛేదిస్తూ రాష్ట్ర పోలీస్ యంత్రాంగం యావత్తు దేశానికి పాఠాలు నేర్పిస్తున్నది. కేంద్ర నిఘా విభాగాలు సైతం ఛేదించలేని ఎన్నో కేసులను పరిష్కరిస్తూ తెలంగాణ పోలీసులు గ్రేట్ అనేలా చేస్తున్నారు. శాంతిభద్రతలు, ప్రజల రక్షణ విధులు సమర్థంగా నిర్వర్తిస్తూనే పౌరుల డాటా చౌర్యం లాంటి కేసులను ఛేదిస్తూ రాష్ట్ర పోలీస్ పవర్ను చూపిస్తున్నారు. కేసీఆర్ సర్కారు అండతో మన పోలీసులు ఎన్నో కేసులను పరిష్కరిస్తున్నారు. ఇదే సమయంలో దేశంలో పలు నిఘా వ్యవస్థల లోపాలను బయటపెడుతున్నారు. పౌరుల డాటా చౌర్యం కేసునే తీసుకొంటే.. ప్రజల వ్యక్తిగత సమాచారం అంగట్లో సరుకులా మారింది.
డాటా చోరీ జరుగుతున్న తీరును సైబరాబాద్ పోలీసులు బట్టబయలు చేశారు. ఒక ఫేక్ కాల్ సెంటర్ను పట్టుకొని తీగలాగితే డొంక కదిలింది. ఆ కాల్ సెంటర్కు వచ్చే డాటా వివరాలు, పౌరుల డాటా చౌర్యానికి గురవుతున్న తీరును మన పోలీసులు బహిర్గతం చేశారు. దీన్ని సీరియస్గా తీసుకొన్న సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర.. కేంద్రప్రభుత్వ వ్యవస్థలు, ఆయా కంపెనీల ప్రతినిధులకు ప్రజల వ్యక్తిగత సమాచార భద్రతపై స్వయంగా లేఖ రాశారు. ఆ తర్వాతే కేంద్ర హోంశాఖ ప్రజల వ్యక్తిగత డాటా భద్రతకు సరైన మార్గదర్శకాలు ఉండాలని నిర్ణయించి, డాటా ప్రొటెక్షన్ చట్టాన్ని తీసుకొచ్చింది. ఇది ఒక విప్లవాత్మక మార్పు. ఇటీవల నకిలీ ఫోర్జరీ పత్రాలు, రబ్బరు స్టాంపులను తయారుచేసే అతిపెద్ద ముఠాను సైబరాబాద్ పోలీసులు పట్టుకొన్నారు. సదరు ముఠా తయారుచేసే నకిలీ పత్రాలతో బ్యాంకుల్లో పెద్దఎత్తున గృహ, వాణిజ్య రుణాలు పొంది బ్యాంకులను మోసం చేసిన కుంభకోణం గుట్టురట్టు రట్టయ్యింది.
ఈ నకిలీ పత్రాలతో రూ.వందల కోట్ల స్కాం జరిగి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ మోసం బ్యాంకింగ్ వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపింది. బ్యాంకులు రుణాల జారీ సమయంలోనే లేయర్ల క్షుణ్ణమైన తనిఖీలు అవసరమని గుర్తించేలా చేసింది. అంతేకాదు.. నకిలీ విత్తన ముఠాలను మన పోలీసులు ఎక్కడికక్కడ ఏరి పారేస్తున్నారు. వ్యవసాయశాఖతో కలిసి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రైతులు అసలైన విత్తనాలు, నకిలీలను గుర్తించేలా శిక్షణ కార్యక్రమాలు సైతం నిర్వహించారు. ఈ పని చేయాల్సింది కేంద్ర వ్యవసాయ శాఖ. కానీ, ఆ శాఖ ఆ దిశగా ఎలాంటి ప్రయత్నం చేయకపోవటం విచారకరం. పలు వ్యవస్థల్లోని లోపాలను బహిర్గతం చేస్తున్న సైబరాబాద్ పోలీసులు.. ఆయా వ్యవస్థలు లోపాలను సరిదిద్దుకొనేలా కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. ముమ్మరం చేసిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు.