Telangana | హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణకు రైల్వే ప్రాజెక్టుల కేటాయింపులో కేంద్ర ప్రభుత్వం మళ్లీ అన్యాయం చేసింది. గురువారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన రైల్వేబడ్జెట్లో ఏపీలో రైల్వేల అభివృద్ధికి రూ.9,138 కోట్లు కేటాయించగా తెలంగాణకు రూ.5,071 కోట్లు మాత్రమే కేటాయించారు. తెలంగాణ కంటే ఏపీకి రూ.4,067 కోట్లు అదనంగా కేటాయించడం గమనార్హం.
పార్లమెంట్లో బడ్జెట్ను ప్రవేశపెట్టిన అనంతరం రైల్వే శాఖ మంత్రి అశ్వినీవైష్ణవ్ ఢిల్లీలో మీడియాకు రైల్వేబడ్జెట్ వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2009 నుంచి 2014 మధ్య కాలంలో ఉమ్మడి ఏపీకి రైల్వే బడ్జెట్లో రూ.886 కోట్లు మాత్రమే కేటాయించగా, నేడు రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం అధిక ప్రాధాన్యం ఇచ్చిందని తెలిపారు. తెలంగాణకు రూ.5,071 కోట్లు కేటాయించామని చెప్పారు. తెలంగాణ ప్రాంతంలో విద్యుద్దీకరణ పనులు వంద శాతం పూర్తయ్యాయని పేర్కొన్నారు. గత పదేండ్లలో వివిధ ప్రాంతాల్లో 414 ైఫ్లైఓవర్లు, అండర్ పాసేజ్లు నిర్మించినట్టు వివరించారు.
చర్లపల్లి రైల్వే టెర్మినల్ పనులు వేగంగా కొనసాగుతున్నాయని, వచ్చే నెల 31 నాటికి అందుబాటులోకి తీసుకొస్తామని దక్షిణ మధ్య రైల్వే జోనల్ మేనేజర్ అరుణ్కుమార్జైన్ తెలిపారు. ఎంఎంటీఎస్ ఫేజ్-2 పనులు కూడా కొనసాగుతున్నాయని, రాష్ట్ర ప్రభుత్వ నిధులు విడుదలైన తర్వాత ఫేజ్-2 పనుల్లో పురోగతి ఉంటుందని పేర్కొన్నారు.