హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): ఎన్నికల్లో పోటీ చేసి ఖర్చులు సమర్పించని వారు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులైన జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ప్రకటించింది. రాష్ట్రంలో 107 మంది ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులని వెల్లడించింది. అనర్హుల్లో అత్యధికంగా నిజామాబాద్ లోక్సభ పార్లమెంట్ పరిధి వారు ఉండటం గమనార్హం.
ఈ నియోజకవర్గం నుంచి గతంలో పసుపు బోర్డు కోసం 72 మంది పార్లమెంట్, 35 మంది అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. ప్రస్తుతం వీరంతా అనర్హులని ఎన్నికల సంఘం ప్రకటించింది. పార్లమెంట్ స్థానాల్లో మెదక్ లోక్సభ పరిధిలో హన్మంతరెడ్డి, మహబూబాబాద్ లోక్సభ నుంచి కొల్లూరి వెంకటేశ్వర్రావు, నల్లగొండ నుంచి పోటీ చేసిన కే వెంకటేశ్ ఉన్నారు. అసెంబ్లీలో పోటీ చేసిన వారు వచ్చే ఆగస్టు వరకు, పార్లమెంట్కు పోటీ చేసినవారు వచ్చే జూన్ వరకు పోటీ చేయడానికి అనర్హులుగా గుర్తించారు.