హైదరాబాద్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీ పెండింగ్లో పెట్టిన మూడు లోక్సభ నియోజకవర్గాల అభ్యర్థులను 14న ఖరారు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే 14 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ స్థానాలను పెండింగ్లో పెట్టింది. ఈ మూడింటిలో ఖమ్మం అత్యంత కీలకంగా మారింది. ఈ నియోజకవ ర్గం పరిధిలో అన్ని అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్ గెలుచుకోవడంతో ఎంపీ టికెట్ కోసం నేతల మధ్య పోటీ నెలకొంది. ఖమ్మం అభ్యర్థి ఖరారైతే తప్ప కరీంనగర్ విషయంలో స్పష్టత వచ్చే అవకాశం లేకపోవడంతో అధిష్ఠానం ఎటూ తేల్చుకోలేకపోతున్నది. పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్రెడ్డి గురువారం ఢిల్లీ వెళ్లినప్పటికీ పార్టీ పెద్దలను కలవకుండానే హైదరాబాద్కు తిరిగొచ్చారు.
ఖమ్మం, కరీంనగర్ అభ్యర్థుల విషయంలో ఆయన తన అభిప్రాయాన్ని ఇప్పటికే అధిష్ఠానానికి తెలియజేయడం వల్లే పార్టీ పెద్దలను కలవలేదని తెలిసింది. 14న ఖమ్మం అభ్యర్థిని ఖరారుచేసే అవకాశం ఉందన్న సమాచారంతో మంత్రి పొంగులేటి సోదరుడు ప్రసాద్రెడ్డి లాబీయింగ్ కోసం శుక్రవారం సాయంత్రం ఢిల్లీలో వాలిపోయినట్టు తెలిసింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గేను ఆయన కలుస్తారని సమాచారం. కాంగ్రెస్లో చేరిన సందర్భంగా ఖమ్మం ఎంపీ టికెట్ను తాను సూచించిన వ్యక్తికే ఇస్తానని అధిష్ఠానం హామీ ఇచ్చిందని పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఇటీవల వెల్లడించారు. టికెట్ ఆశిస్తున్న పారిశ్రామికవేత్త వంకాయలపాటి రాజేంద్రప్రసాద్ను తాజాగా సీఎం రేవంత్రెడ్డి సలహాదారు వేం నరేందర్రెడ్డి పిలిపించుకొని చర్చించినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.