కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశ బడ్జెట్లా కాకుండా కొన్ని రాష్ర్టాల బడ్జెట్గా ఉన్నది. తెలంగాణతోపాటు మరికొన్ని రాష్ట్రాలకు ఈ బడ్జెట్లో కేటాయింపులు అసలే లేవు. ‘సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్’ అని చెప్పుకొంటున్న కేంద్రం.. నిధులను అన్ని రాష్ర్టాలకు సమానంగా ఎందుకు పంపిణీ చేయడం లేదు?. ఎనిమిదేండ్లలో ఒక్క మెడికల్ కాలేజీని తెలంగాణకు కేటాయించలేదు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రకటించిన 157 నర్సింగ్ కాలేజీల కేటాయింపులోనూ అదే జరుగనున్నది. గుజరాత్లోని గిఫ్ట్ సిటీకి 2025 వరకు పొడిగించిన పన్ను మినహాయింపును తెలంగాణలోని నిమ్జ్, ఇతర సెజ్లకు ఎందుకు ఇవ్వరు?. కర్ణాటక అప్పర్ భద్ర ప్రాజెక్టుకు రూ.5,300 కోట్లు కేటాయించడం సంతోషమే. మరి కాళేశ్వరం, మిషన్ భగీరథ ప్రాజెక్టులకు కేటాయింపులు ఏవి?. నీతి ఆయోగ్ సిఫారసు చేసినా ఈ పథకాలకు ఒక రూపాయి ఇవ్వలేదు. కొత్త పథకాలు ప్రకటించకపోవడం, పాతవాటిని విస్మరించడం చూస్తుంటే ఏడాది తర్వాత ఈ ప్రభుత్వం వెళ్లిపోతున్నట్టే కనిపిస్తున్నది.
దేశ ఆర్థిక వృద్ధిని నిర్దేశించని బడ్జెట్ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. కరోనా సమయంలో ఎంఎస్ఎంఈలకు రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించిన మోదీ సర్కార్.. ఇప్పటివరకు లక్ష కోట్లు కూడా విడుదల చేయలేదు. విమానాశ్రయాలు వంటి ప్రాజెక్టులను ప్రకటించినా అవన్నీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు, బీజేపీ పాలిత రాష్ట్రాలకే మంజూరు చేస్తారు. నిజామాబాద్, వరంగల్ జిల్లాలో విమానాశ్రయాల ఏర్పాటుకు భూమి అందుబాటులో ఉన్నాయని తొమ్మిదేండ్లుగా కోరుతున్నా కేంద్రం పెడచెవిన పెట్టింది. మౌలిక సదుపాయాలకు కేటాయించిన రూ.10 లక్షల కోట్లను ఏయే సదుపాయాల కల్పనకు ఖర్చు చేస్తారో చెప్పాలి. ఈ నిధులు కేవలం వారి కార్పొరేట్ మిత్రులకే వెళ్తాయా? స్పష్టత ఇవ్వాలి.
-ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
సంక్షేమానికి కేంద్రం మొండిచెయ్యి
కేంద్ర బడ్జెట్లో సంక్షేమ రంగానికి మొండిచెయ్యి చూపింది. ఎస్సీ, ఎస్టీలకు రూ.15 వేల కోట్ల చొప్పున, బీసీలకు రూ.1,400 కోట్లు మాత్రమే కేటాయించి అణగారిన వర్గాలను తీవ్రంగా అవమానించింది. తెలంగాణ ప్రభుత్వం ఎస్సీల అభ్యున్నతికి రూ.38 వేల కోట్లు ఖర్చు చేస్తుంటే, కేంద్రం దేశ వ్యాప్తంగా కేవలం రూ.15 వేల కోట్లు కేటాయించడం సిగ్గుచేటు. ఈ బడ్జెట్ కార్పొరేట్ల కొమ్ము కాసే విధంగా ఉన్నది. ఉద్యోగులు, సింగరేణి కార్మికులకు పన్ను మినహాయింపు ఆశాజనకంగా లేదు.
– కొప్పుల ఈశ్వర్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి
ఉపాధి కూలీల పొట్టగొట్టింది
ఇది తెలంగాణ వ్యతిరేక బడ్జెట్. పేదలు, కూలీలకు కేటాయింపుల్లో అన్యాయం జరిగింది. తెలంగాణకు రావాల్సిన నిధులు ఇవ్వకుండా ఈ సారి కూడా మొండిచెయ్యి చూపింది. రాష్ట్రం చేసిన విజ్ఞప్తులను పట్టించుకోలేదు. ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రతో ఏటా నిధుల కేటాయింపుల్లో కోతలు పెడుతున్నది. ఉపాధి హామీ పథకం కింద తెలంగాణకు రావాల్సిన దాదాపు రూ.800 కోట్లు ఇవ్వకుండా కొర్రీలు పెడుతున్నది. ఉపాధి హామీ కోసం కేవలం రూ.60 వేల కోట్లు కేటాయించడం దారుణం. గత ఏడాది రూ.89 వేల కోట్లు కేటాయించగా ఈ సారి రూ.30 వేల కోట్లకుపైగా కోత విధించడం దురదృష్టకరం.
– ఎర్రబెల్లి దయాకర్రావు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి
తెలంగాణపై వివక్ష
గత కొన్నేండ్లుగా బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణపై కేంద్రం వివక్ష కొనసాగుతున్నది. తెలంగాణ రాష్ట్రం చేసిన అభ్యర్థనలను పట్టించుకోలేదు. చట్టబద్ధంగా రావాల్సిన నిధులనూ ఇవ్వకుండా కక్షసాధింపులకు దిగింది. తెలంగాణలో ఏ ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదు. తెలంగాణకు ఇంత అన్యాయం జరుగుతున్నా రాష్ర్టానికి చెందిన బీజేపీ ఎంపీలు నోరు మెదపకపోవడం దారుణం.
– అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి