హైదరాబాద్, ఫిబ్రవరి 10(నమస్తే తెలంగాణ): తమది రైతు పక్షపాత ప్రభుత్వమని గొప్పలు చెప్పుకొంటున్న కాంగ్రెస్ బడ్జెట్లో రైతులను పక్కనపెట్టింది. తొలి బడ్జెట్లోనే రైతులపై తమకున్న ప్రేమ ఏపాటిదో చెప్పకనే చెప్పింది. శనివారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో వ్యవసాయ రంగానికి రూ. 19,746 కోట్లు మాత్రమే కేటాయించింది. గత బడ్జెట్తో పోలిస్తే ఇది రూ.7,085 కోట్లు తక్కువ కావడం గమనార్హం. 2023-24 బడ్జెట్లో కేసీఆర్ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి రూ.24,254 కోట్లు కేటాయించి రైతుల పక్షపాతి అనిపించుకుంది.
రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ పథకాలకు గత ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించేది. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం వాటి ఊసే ఎత్తలేదు. ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. రూ. 2 లక్షల రుణమాఫీకి మాత్రం చర్యలు తీసుకుంటున్నామని ప్రకటించింది. ఆ పథకాన్ని సమీక్షించి పెంచిన మొత్తాన్ని ఇస్తామని వివరించింది. రైతు కూలీలు, కౌలురైతు పథకాల ఊసెత్తలేదు.
వ్యవసాయశాఖకు రూ. 19,746 కోట్ల బడ్జెట్ కేటాయించిన ప్రభుత్వం అనుబంధ రంగాలైన పశుసంవర్ధక, మత్స్యశాఖలను మరిచిపోయింది. వీటికి నిధులు కేటాయించలేదు. గత ప్రభుత్వం వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ. 5,188 కోట్లు కేటాయించింది. అంతేకాదు, ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఆయిల్పామ్ సాగుకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. గత ప్రభుత్వం మాత్రం ప్రతి బడ్జెట్లోనూ రూ. 1000 కోట్లు కేటాయించేది.