BRS | హైదరాబాద్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించే లక్ష్యంతో గులాబీ శ్రేణులు కదనోత్సాహంతో ముందుకు సాగుతున్నాయి. ప్రతి నియోజకవర్గంలో బీఆర్ఎస్ శ్రేణుల సమరోత్సాహాన్ని చూసి కాంగ్రెస్, బీజేపీ బెంబేలెత్తిపోతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్, ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు గత పదిరోజులుగా రాష్ట్రంలోని దాదాపు అన్ని నియోజకవర్గాలను చుట్టివస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, భూమిపూజలు చేస్తూ కలియతిరుగుతున్నారు. మెడికల్ కాలేజీల నిర్మాణాలకు భూమిపూజలతో మంత్రి హరీశ్రావు, హైదరాబాద్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల్లో ఐటీ పార్కుల ప్రారంభోత్సవాలు, భూమిపూజలతో మంత్రి కేటీఆర్ ఎడతెరపిలేని కార్యక్రమాలతో బిజీబిజీగా సాగుతున్నారు. మరోవైపు మంత్రులు జగదీశ్రెడ్డి, నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, వేముల ప్రశాంత్రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావు, తలసాని శ్రీనివాసయాదవ్, సబితాఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, సత్యవతిరాథోడ్, పట్నం మహేందర్రెడ్డి, మహమూద్అలీ, ఇంద్రకరణ్రెడ్డి, పువ్వాడ అజయ్కుమార్ వారి వారి ఉమ్మడి జిల్లాల్లో అటు అభ్యర్థులైన ఎమ్మెల్యేలను, పార్టీ శ్రేణులను ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ పకడ్బందీ కార్యాచరణ అమలు చేస్తున్నారు.
ఆత్మీయ సమ్మేళనాలు, 21 రోజుల దశాబ్ది ఉత్సవాలు, పోడుభూములకు అటవీ భూ యాజమాన్య హక్కు పత్రాల పంపిణీ, మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవాలు తదితర కార్యక్రమాలతో గత మూడు, నాలుగునెలల నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు అన్ని స్థాయిల పార్టీ శ్రేణులతోపాటు ప్రజలతో పూర్తిగా మమేకమైపోయారు. దేశానికే ఆదర్శవంతమైన పాలన అందిస్తున్న బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్పై, మంత్రులపై కాంగ్రెస్, బీజేపీ నేతలు చేస్తున్న దుష్ప్రచారాన్ని నియోజకవర్గాల్లో అన్ని స్థాయిల పార్టీ శ్రేణులు ఎక్కడిక్కడ తిప్పికొడుతున్నాయి. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో నియోజకవర్గంలో జరిగిన ప్రగతి, 60 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో దుర్గతిని వివరిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు ప్రజల్లోకి దూసుకుపోతున్నాయి. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను నేరుగా కలుస్తూ సీఎం కేసీఆర్ మూడోసారి అధికారం చేపట్టాల్సిన ఆవశ్యకతను ప్రజలకు వివరిస్తున్నారు.
మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జడ్పీ చైర్మన్లు, మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, రాష్ట్రస్థాయి కార్పొరేషన్ల చైర్మన్లు, పార్టీ జిల్లా అధ్యక్షులు, జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్లు ఇలా వివిధ హోదాల్లో ఉన్న పార్టీ నేతలంతా నిత్యం ప్రజలతో ఉండాలని సీఎం కేసీఆర్ ఇచ్చిన ఆదేశాలు క్షేత్రస్థాయిలో ఏ రీతిలో అమలు అవుతున్నాయనే విషయాన్ని పార్టీ మానిటరింగ్ సెల్ ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నది. ఆయా నియోజకవర్గాల్లో అనుసరించాల్సిన వ్యూహ, ప్రతివ్యూహాలను ఎమ్మెల్యేలకు అందిస్తున్నది. 2014, 2018 ఎన్నికల్లో అనుసరించిన సమన్వయ వ్యూహాన్ని ఎన్నికల షె డ్యూల్ కన్నా ముందే అమలు చేస్తూ వినూత్నం గా ముందుకు సాగుతున్నది. ఈ సమన్వయమే బీఆర్ఎస్ను మూడోసారి అతి సునాయాసంగా అధికారంలోకి తీసుకొస్తుందనే ధీమాతో గులాబీ దండు ముందుకు సాగుతున్నది.
ఒకవైపు బీఆర్ఎస్ అభ్యర్థులు నియోజకవర్గాల్లో కలియతిరుగుతుంటే, కాంగ్రెస్, బీజేపీ టికెట్లు ఆశిస్తున్నవారు ఢిల్లీ చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. రకరకాల కమిటీలు, వడపోతల పేరుతో అధిష్ఠానం కాలయాపన చేస్తున్నదనే నిర్వేదం కాంగ్రెస్ ఆశావాహుల్లో వ్యక్తమవుతున్నది.