Telangana | హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): తెలంగాణ అవతరణ అనంతరం సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం వరుసగా రెండోసారి అధికారపగ్గాలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటివరకు 8 సార్లు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. ఈ నెల 3 నుంచి 6 వరకు 4 నాలుగు రోజులపాటు జరిగిన సమావేశాలనే ఈ ప్రభుత్వానికి చివరి సమావేశాలుగా పరిగణించాల్సి ఉంటుంది. కేసీఆర్ వరుసగా రెండోసారి అధికార పగ్గాలు చేపట్టాక 2019 జనవరి 17న తొలి సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ లెక్కన వచ్చే ఏడాది జనవరి 16 నాటికి కొత్త అసెంబ్లీ కొలువుదీరాల్సిందేనని రాజ్యాంగ నిబంధన స్పష్టం చేస్తున్నది. ఈ లోపు ఎన్నికల ప్రక్రియలన్నీ పూర్తవుతాయి.
ఈ నేపథ్యంలో ఆదివారం అసెంబ్లీలో ఉద్విగ్న వాతావరణం ఏర్పడింది. ఏ ఇద్దరు సభ్యులు కలుసుకున్నా ‘ఈ సమావేశాలే ఆఖరివి.. మళ్లీ గెలు ద్దాం.. ఈ అపూర్వ సభకు తిరిగి వద్దాం’ అని చర్చించుకోవడం కనిపించింది. సభా సమయం పూర్తయ్యాక అసెంబ్లీలో, లాబీలో, అసెంబ్లీ ప్రాంగణంలో సభ్యులు పరస్పర ఆలింగనాలు చేసుకున్నారు. అసెంబ్లీ ప్రాంగణం వెలుపల గ్రూప్ ఫొటోలు, సెల్ఫీలు దిగారు. ఇప్పటివరకు తమ ప్రాంతాల్లోని అనేక సమస్యలను సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో పరిష్కరించుకున్నామని హర్షం వ్యక్తం చేశారు.
నాలుగున్నరేండ్లు.. 408 గంటలు.. సుదీర్ఘంగా సాగిన సమావేశాలు
తెలంగాణ రెండో శాసనసభ 2019 జనవరి 17 నుంచి 2023 ఆగస్టు 6 మధ్యకాలంలో మొత్తం 8 సార్లు సమావేశమైంది. 73 రోజులు జరిగిన ఈ సమావేశాల్లో సభ్యులు 408 గంటల 3 నిమిషాలపాటు వివిధ అంశాలపై చర్చించారు. అసెంబ్లీ ప్రొసీజర్ ప్రకారం సగటున రోజుకు 4 గంటలకుపైగా ఈ చర్చలు కొనసాగాయి. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ ఇంతటి సగటు నమోదవడం విశేషమని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
హ్యాట్రిక్ ఖాయం
తెలంగాణలో ఏర్పాటు తరువాత కేసీఆర్ నేతృత్వంలో 63 మంది ఎమ్మెల్యేలతో ఏర్పాటైన ప్రభుత్వం.. రెండో విడతలో 88 మంది శాసనసభ్యులతో కొలువుదీరింది. తెలంగాణ సర్వతోముఖాభివృద్ధికి కేసీఆర్ చేపట్టిన కార్యక్రమాలకు మెచ్చి వేర్వేరు పార్టీలకు చెందిన ఎమ్మెల్యే లు ప్రజాభీష్టం మేరకు బీఆర్ఎస్లో చేరడంతో అసెంబ్లీలో పార్టీ బలం 105కు పెరిగింది. వచ్చే ఏడాది బీఆర్ఎస్ మరిం త బలంతో వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమన్న ధీమాతో మంత్రులు, ఎమ్మెల్యేలు ఆదివారం అసెంబ్లీ ప్రాంగణాన్ని వీడారు.