హైదరాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ): ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీ ఫిరాయించలేదని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ ఇచ్చిన తీర్పుపై బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన దానం.. ఆ తరువాత లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. దీనిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేయగా.. విచారణ జరిపిన స్పీకర్ దానంకు క్లీన్చిట్ ఇచ్చారు.
స్పీకర్ తీర్పును సవాల్ చేస్తూ బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. స్పీకర్ తీర్పును క్వాష్ చేయాలని పిటిషన్లో కోరారు. ఎమ్మెల్యేగా దానం నాగేందర్ తీసుకుంటున్న జీతాన్ని వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తిచేశారు. ఈ పిటిషన్పై హైకోర్టు సోమవారం విచారణ చేపట్టనున్నది.