వనపర్తి, జనవరి 1 : అభివృద్ధితో బీఆర్ఎస్ ప్రజలను జాగృతం చేస్తుంటే.. అవినీతి, విద్వేషాలతో బీజేపీ ప్రజలను ఏమార్చి కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ధ్వజమెత్తారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటుకు తెగనమ్ముతున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజలకు ఉపాధిని దూరం చేస్తున్నదని విమర్శించారు. ఆదివారం వనపర్తిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 238 మందికి సీఎం సహాయనిధి నుంచి విడుదలైన రూ.67 లక్షల విలువైన చెక్కులను మంత్రి పంపిణీ చేశారు.
అనంతరం కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా, స్థానిక నాయకులతోపాటు చెక్కులు అందుకున్న వారితో కలిసి మంత్రి నిరంజన్రెడ్డి సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అనారోగ్యానికి గురై మెరుగైన వైద్య చికిత్స కోసం దరఖాస్తు చేసుకున్న బాధితులకు సీఎంఆర్ఎఫ్ కొండంత అండగా నిలుస్తున్నదని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు.