Governors | స్పెషల్ టాస్క్ బ్యూరో హైదరాబాద్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): గవర్నర్ వ్యవస్థను కేంద్రంలోని బీజేపీ సర్కార్ భ్రష్టు పట్టిస్తున్నది. రాజ్యాంగ పరిరక్షకులుగా వ్యవహరించాల్సిన గవర్నర్లను కేంద్రం తన రాజకీయ ప్రతీకారాలు, ప్రయోజనాల కోసం వాడుకొంటున్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు గవర్నర్ వ్యవస్థను వ్యతిరేకించిన ప్రధాని మోదీ, ఇప్పుడు అదే గవర్నర్లను బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలను అస్థిరపరచడానికి, ఇబ్బంది పెట్టడానికి పావులుగా వినియోస్తున్నారు.
ప్రస్తుత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ పశ్చిమ బెంగాల్ గవర్నర్గా ఉన్నప్పుడు అక్కడి టీఎంసీ ప్రభుత్వాన్ని ముప్పుతిప్పలు పెట్టారు. అందుకు నజరానాగానే ఆయనకు ఉపరాష్ట్రపతి పదవి వరించిందన్న విమర్శలూ ఉన్నాయి. విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న పశ్చిమ బెంగాల్, పంజాబ్, తమిళనాడు, కేరళ, ఢిల్లీ, తెలంగాణ, గతంలో మహారాష్ట్రలో గవర్నర్ల వ్యవహారశైలి ఆ వ్యవస్థనే ప్రశ్నార్థకంగా మార్చింది. తాజాగా తెలంగాణ గవర్నర్ తమిళిసై రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు చేసిన ప్రతిపాదనలను తిప్పిపంపడంతో గవర్నర్ వ్యవస్థ దుర్వినియోగంపై మరోసారి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. గవర్నర్ల అరాచకీయం బీజేపీ సర్కార్ హయాంలో పరాకాష్టకు చేరుకొన్న నేపథ్యంలో గవర్నర్ల వ్యవస్థ దేశానికి అవసరమా? అనే చర్చను లేవదీస్తున్నది.
తమిళనాడులో అన్ని పక్షాలు ఏకం
తమిళనాడులో గవర్నర్కు వ్యతిరేకంగా పాలక పక్షానికి ప్రతిపక్షాలు కూడా మద్దతు పలకడం విశేషం. గవర్నర్ గిరీకి వ్యతిరేకంగా అఖిలపక్షం ఆధ్వర్యంలో రాజ్భవన్ ఎదుట నిరసన ప్రదర్శన కూడా జరిగింది. సీఎం స్టాలిన్ సిఫారసు చేయకుండానే మంత్రి సెంథిల్ను గవర్నర్ నేరుగా బర్తరఫ్ చేయడంపై తీవ్ర వివాదాస్పదం అయిన విషయం తెలిసిందే. ఈ అసాధారమైన నిర్ణయంపై సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్టు స్టాలిన్ హెచ్చరించడంతో గవర్నర్ తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకొన్నారు.
మంత్రినే మార్చాలన్న కేరళ గవర్నర్
కేరళ గవర్నర్ ఆరిఫ్ ఖాన్కు అయితే ఏకంగా ఒక మంత్రి తనకు నచ్చలేదు. ‘రేపటి’లోగా ఆయనతో రాజీనామా చేయించమని నేరుగా సీఎం విజయన్కే సిఫారసు చేశారు. మంత్రిని రాజీనామా చేయమని కోరే అధికారం గవర్నర్కు ఎక్కడిది? అని ఆ అంశం పెద్ద వివాదం అయింది. ఇంకా అక్కడ ఇలాంటి చర్యలు ఎన్నో జరిగాయి.
తెల్లవారుజామున ప్రమాణస్వీకారం
ప్రభుత్వ ఏర్పాటుకు మెజార్టీ లేకపోయినా గవర్నర్ భగత్సింగ్ కోష్యారీ గుట్టుచప్పుడు కాకుండా తెల్లవారుజామున రాజ్భవన్లోబీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్తో ప్రమాణస్వీకారం చేయించి ప్రజాతీర్పును అభాసుపాలు చేసిన తెలిసిందే. దీనిపై ప్రజాగ్రహం వ్యక్తంకావడంతో శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీ సంకీర్ణ ప్రభుత్వంతో ప్రమాణ స్వీకారం చేయించాల్సి వచ్చింది.
ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ రాకున్నా..
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 250 కార్పొరేటర్లకుగాను 134 స్థానాలను గెలుచుకున్నది. 15 ఏండ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ ఓటమి పాలైనప్పటికీ ప్రజాతీర్పునకు వ్యతిరేకంగా గవర్నర్ నామినేటెడ్ సభ్యులను నియమించి, వారికి ఓటు కల్పించి బీజేపీని అధికార పీఠంపై కూర్చోబెట్టడానికి విశ్వప్రయత్నాలు చేశారు. దీన్ని ఆప్ సుప్రీంకోర్టులో సవాల్ చేయడంతో నామినేటెడ్ సభ్యుల నియామకాన్ని రద్దు చేశారు.
పంజాబ్లో హామీల అమలుకు అడ్డుపుల్ల
పంజాబ్లో ఆప్ అధికారంలోకి వచ్చింది. ఇది నచ్చని కేంద్రంలోని బీజేపీ సర్కార్ గవర్నర్ ద్వారా అక్కడి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించింది. ఎన్నికల హామీలను నెరవేర్చకుండా గవర్నర్ అడుగడుగునా అడ్డుతగిలారు. చివరకు శాసనసభ సమావేశాలను నిర్వహించుకోవడానికి గవర్నర్ అనుమతి నిరాకరించారు. ఒకదశలో ఆప్ ప్రభుత్వాన్ని రద్దు చేస్తానని కూడా గవర్నర్ భన్వారిలాల్ పురోహిత్ హెచ్చరించారు.
తెలంగాణలో ప్రతీదానికి మోకాలడ్డు
తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్న బీసీ నాయకుడు డాక్టర్ శ్రవణ్, ఎరుకల సామాజిక వర్గానికి చెందిన కుర్ర సత్యనారాయణ పేర్లను గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా రాష్ట్ర ప్రభుత్వం తాజాగా సిఫారసు చేయగా గవర్నర్ తమిళిసై తిరస్కరించిన విషయం తెలిసిందే. అంతకుముందు కూడా ఇలాగే ఎమ్మెల్సీగా పాడి కౌశిక్రెడ్డి పేరునూ తిరస్కరించారు. యూనివర్సిటీల కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బిల్లుతో పాటు అనేక బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలపకుండా, తిరస్కరించకుండా నెలల తరబడి తన వద్దనే అట్టిపెట్టుకోవడం పట్ల రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది.
ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లును కూడా ఆమోదించకుండా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చూశారు. గవర్నర్ నాన్చుడు ధోరణిపై ఆర్టీసీ కార్మికులు ఆందోళన బాట పట్టడంతో ఎట్టకేలకు ఆమోదించక తప్పలేదు. ఓ వైపు యూనివర్సిటీలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని ఏబీవీపీ ద్వారా ఆందోళనలు చేయించేది బీజేపీనే. మరోవైపు ఆ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం బిల్లు పంపిస్తే గవర్నర్ ద్వారా ఆపేది కూడా బీజేపీయేననే విమర్శలు పెద్దయెత్తున వస్తున్నాయి.