హైదరాబాద్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వరంగ సంస్థలన్నింటినీ ప్రైవేట్కు ధారాదత్తం చేసినట్టే, భారత ఆహార సంస్థను (ఎఫ్సీఐ) కూడా కార్పొరేట్లకు అప్పగించే కుట్ర జరుగుతున్నదని తెలంగాణ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ ఆరోపించారు. ఆ కుట్రలో భాగంగానే ఎఫ్సీఐని ముందుగా నిర్వీర్యం చేస్తున్నారని అన్నారు. ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడుతూ..కేంద్రం మెడలు వంచి అయినా వరి ధాన్యం మొత్తాన్ని కొంటామని ప్రకటించే వరకు ప్రతి ఒక్కరూ రైతుల పక్షాన నిలబడాలని పిలుపునిచ్చారు. వివరాలు ఆమె మాటల్లోనే..
ధాన్యం కొనకపోవడం వెనుక పెద్ద కుట్ర
యాసంగిలో వరి ధాన్యాన్ని కొనుగోలు చేయనని కేంద్రం చెప్పడం వెనక కుట్రపూరిత వ్యూహం ఉంది. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్ సంస్థలకు ధారాదత్తం చేస్తున్నట్టుగానే ఎఫ్సీఐని కూడా కార్పొరేట్లకు అప్పగించాలని చూస్తున్నది. ఇందులో భాగంగానే వరి ధాన్యం కొనుగోలు బాధ్యత నుంచి తప్పుకుంటుందన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. ధాన్యం కొనుగోళ్లను మునుపెన్నడూ ఏ ప్రభుత్వమూ ఇంతగా జటిలం చేయలేదు. రైతుల ఉద్యమానికి కేంద్రం దిగి వచ్చి సాగు చట్టాలను వెనకకు తీసుకున్నట్టుగానే వరి ధాన్యం మొత్తాన్ని కొనుగోలు చేస్తామని కేంద్రం ప్రకటించే వరకు పోరాటం చేయాలి. సాగు చట్టాల రద్దు కూడా రైతులపై ప్రేమతో కేంద్రం తీసుకున్న నిర్ణయం కాదన్నది బహిరంగ రహస్యమే.
ఎఫ్సీఐని నిర్వీర్యం చేసే పన్నాగం
ఎల్ఐసీ, బీఎస్ఎన్ఎల్, రైల్వేలు, ఎయిర్లైన్స్ను తెగనమ్మినట్టుగానే ఎఫ్సీఐని కూడా భవిష్యత్తులో కార్పొరేట్లకు అప్పగించదన్న గ్యారంటీ లేదు. ఎఫ్సీఐని నిర్వీర్యం చేయాలంటే మొదట అది చేస్తున్న బాధ్యతల నుంచి తప్పించాలన్నది కేంద్రం పన్నాగం. రైతుల పండించిన ధాన్యాన్ని కొననంటే ఆహార భద్రత బాధ్యతల నుంచి కేంద్రం తప్పుకున్నట్టే కదా. ఉన్న సరుకులు అయిపోతేనే కొంటాం అనడానికి కేంద్రం వ్యాపారి కాదు కదా. ఖాయిలాపడిన పరిశ్రమలను కాపాడటానికి ఉద్దీపన చర్యలు తీసుకున్నట్టే, వ్యవసాయరంగాన్ని, రైతులను ఆదుకోవడానికి కేంద్రం ఎందుకు ముందుకు రావడం లేదు. లక్షల కోట్లు బ్యాంకులకు ఎగవేసిన బడా బాబుల పక్షాన నిలబడే కేంద్రం రైతులను ఆదుకోలేదా?.
పంజాబ్, హర్యాణాలో కొన్నప్పుడు,ఇక్కడెందుకు కొనదు?
తెలంగాణలో వరి ధాన్యం కొనబోమని చెప్పిన కేంద్రం పంజాబ్, హర్యానాలో ధాన్యాన్ని ఎందుకు సేకరించింది? అంటే అక్కడ ఎన్నికలు ఉన్నాయి కనుక కొంటాం, ఇక్కడ ఎన్నికలు లేవు కనుక కొనం అనే కదా? రాజకీయ అవసరాలకు అనుగుణంగా వ్యవసాయ రంగాన్ని బలి చేస్తారా? దేశ జనాభాలో 80 శాతం వ్యవసాయ రంగంపైనే ఆధారపడి ఉన్నది. ప్రధాన జీవనాధారం కూడా ఇదే. వ్యవసాయ రంగం దెబ్బతింటే గ్రామీణ భారతం ఏమైపోవాలి?. యాసంగిలో వరి ధాన్యం కొనుగోలు సమస్యగా దీనిని చూడవద్దు. భవిష్యత్లో రైతు వ్యతిరేక చర్యలకు, విధానాలకు ఇది నాంది ప్రస్తావనగా భావించి రైతన్నలు మేల్కొనాలి.