ములుగు రూరల్, జనవరి 18: దళితబంధు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ లబ్ధిదారులు ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. గురువారం ములుగు కలెక్టరేట్ వద్ద ఉన్న వాటర్ ట్యాంకు ఎక్కి నిరసన తెలిపారు. సుమారు 6 గంటలపాటు ఆందోళన చేపట్టారు. మంత్రి సీతక్క, కలెక్టర్ వచ్చి తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కవ్వంపల్లి బాబు, మీదిగొండ రాజేంద్రప్రసాద్, ఊట్ల మోహన్ వాటర్ ట్యాంకు ఎక్కారు. రాజేంద్రప్రసాద్ పెట్రోల్ మీద పోసుకొని తన ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ విజయ్భాస్కర్, ఎస్సై వెంకటేశ్వర్, సిబ్బంది నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.
ములుగు పర్యటనలో ఉన్న సీతక్కతోపాటు కలెక్టర్ రాకపోవడంతో ట్యాంకు వద్ద ఉన్న మరికొందరు లబ్ధిదారులు కలెక్టరేట్ను ముట్టడించారు. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు దళితబంధు సాధన కమిటీ జిల్లా అధ్యక్షుడు కోగిల మహేశ్ను అరెస్టు చేసి పోలీస్స్టేషన్కు తరలించి కొంత సేపటికి సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. నిరసన ఉధృతంగా మారుతుండటంతో ఆర్డీవో సత్యపాల్రెడ్డి వాటర్ ట్యాంకుపై ఉన్న లబ్ధిదారులను ఉద్దేశించి మాట్లాడారు. సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని, విషయాన్ని కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి నివేదిస్తామని హామీ ఇవ్వడంతో లబ్ధిదారులు కిందకు దిగారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ జిల్లాలోని 1,100 మంది రెండో విడత దళితబంధు పథకానికి ఎంపికయ్యారని, లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వం వెంటనే డబ్బులను జమ చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు.