హైదరాబాద్, మార్చి 27 (నమస్తే తెలంగాణ): పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ముంపుపై సంయుక్త సర్వే నిర్వహించే విషయంలో ఏపీ సర్కారు మీనమేషాలు లెక్కిస్తున్నది. గత జనవరి 25న కేంద్ర జల్శక్తిశాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలోనే సంయుక్త సర్వే నిర్వహించాలని సీడబ్ల్యూసీ స్పష్టమైన ఆదేశాలిచ్చినా అడుగు ముందుకు పడలేదు. అయినప్పటికీ పీపీఏ స్పందించ డం లేదు. ఇదే విషయమై తెలంగాణ సర్కారు ఇప్పటికే పలుమార్లు పీపీఏకు, సీడబ్ల్యూసీకి లేఖలు రాసినప్పటికీ ఫలితం లేదు. సంయుక్త సర్వే చేపట్టేందుకు పీపీఏ చొరవ చూపడం లేదు. తాజాగా కొత్తగూడెం సీఈ మరోసారి ఇదే విషయమై పీపీఏకు లేఖ రాశారు.
పోలవరం ప్రాజెక్టు ఎత్తుపై కేంద్రం పార్లమెంటులో పూటకో మాట చెప్తున్నది. పోలవ రం ప్రాజెక్టు ఎత్తు 45.72 మీటర్లు అని ఒకసారి, 41.15 మీటర్లకే పరిమితం చేశామని మరోసారి ప్రకటనలు చేస్తున్నది. పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గించాలని ఏపీ ప్రభుత్వం ఏమైనా ప్రతిపాదనలు చేసిందా? అని సోమవారం రాజ్యసభలో ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ప్రశ్నించగా అందుకు కేంద్ర జల్శక్తి సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఏపీ ప్రతిపాదించినట్టు తమవద్ద సమాచారం ఏమీ లేదని చెప్పారు.