Paddy Procurement | కేసముద్రం, డిసెంబర్18: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్ రైతుల ఆందోళనలతో అట్టుడికింది. వ్యాపారులు ధాన్యం ధరను తగ్గించారంటూ రైతులు ఆందోళనకు దిగారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. వ్యవసాయ మార్కెట్కు సోమవారం 43 వేల బస్తాల ధాన్యం విక్రయానికి వచ్చింది. జైశ్రీరాం రకానికి క్వింటాకు గరిష్ఠంగా రూ.3,301, కనిష్ఠంగా రూ.2,009 ధర పలికింది. ఆర్ఎన్ఆర్ రకానికి గరిష్ఠంగా రూ.3,159, కనిష్ఠంగా రూ.2,000, హెచ్ఎంటీ రకానికి గరిష్ఠంగా 3,259, కనిష్ఠంగా రూ.2,002 పలికింది. అయితే, గత శుక్రవారం కంటే తక్కువ ధర నిర్ణయించారంటూ రైతులు కోపోద్రిక్తులయ్యారు.
రైతులు తీసుకొచ్చిన ఉత్పత్తులకు వ్యాపారులు ఈ-నామ్ ద్వారా టెండర్ వేస్తారు. దీనిని మార్కెట్ అధికారులు ప్రతిరోజూ మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఓపెన్ చేసి ధర నిర్ణయిస్తారు. సోమవారం మార్కెట్కు పరిమితికి మించి ధాన్యం రావడంతో మధ్యాహ్నం 2 గంటల తరువాత టెండర్ ఓపెన్ చేసి రైతులకు ధాన్యం ధరలను తెలియపరిచారు. వాటిని పరిశీలించిన రైతు లు.. క్వింటాకు రూ.400 పైబడి ధర తగ్గించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ధాన్యా న్ని బస్తాల్లోకి ఎత్తుతున్న కూలీలను అడ్డుకున్నారు.
బస్తాల్లోకి ఎత్తిన ధాన్యాన్ని కింద పోసి నిరసన తెలిపారు. ఉద్దేశపూర్వకంగానే వ్యాపారులు ధాన్యం ధరను తగ్గించారంటూ రైతులు మార్కెట్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఆ తరువాత మార్కెట్ ఎదుట వరంగల్ వెళ్లే ప్రధాన రహదారిపై బైఠాయించారు. విష యం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రైతులు, మార్కెట్ అధికారులతో మాట్లాడినా శాంతించలేదు. చివరకు ఎక్కువ ధర పలికిన ధాన్యాన్ని రైతులు ఈరో జు అమ్ముకోవచ్చని, తక్కువ ధర పలికిన ధాన్యానికి మళ్లీ టెండర్ వేయిస్తామని హామీ ఇచ్చారు. దీంతో రైతులు ఆందోళన విరమించారు. మార్కెట్కు పరిమితికి మించి ధాన్యం విక్రయానికి రావడంతో పేరుకుపోయింది. దీంతో మార్కెట్లో స్థలం లేకపోవడంతో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ నీలం సుహాసిని మార్కెట్కు ఒకరోజు సెలవు ప్రకటించారు.