Chevella Accident | చేవెళ్ల బస్సు ప్రమాదం ఘటనపై ఆర్టీసీ అధికారులు వివరణ ఇచ్చారు. బస్సు ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ఆర్టీసీ ప్రకటన విడుదల చేసింది. టిప్పర్ అతివేగమే ప్రమాదానికి కారణమని దర్యాప్తులో తేలిందని చెప్పింది. రోడ్డు మలుపులో అతివేగం వల్ల టిప్పర్ డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడని, ప్రమాదానికి ఆర్టీసీ బస్సు గానీ, బస్ డ్రైవర్ కారణం కాదని స్పష్టం చేసింది. బస్ పూర్తి ఫిట్నెస్తోనే ఉందని.. డ్రైవర్ సర్వీసు రికార్డులోనూ గతంలో యాక్సిడెంట్లు లేనట్లు తేలిందని చెప్పింది. రోడ్డు మలుపు వద్ద అతి వేగంతో ఉన్న టిప్పర్ డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం ఈ దుర్ఘటన జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పినట్లుగా సంస్థ పేర్కొంది.
సోమవారం తెల్లవారు జామున 4.40 గంటల ప్రాంతంలో తాండూరు నుంచి బయలుదేరిన ప్రైవేట్ హైర్ (TS 34TA 6534) ఎక్స్ప్రెస్ బస్ను ఇందిరానగర్ సమీపంలో కంకర లోడ్తో ఎదురుగా వచ్చిన టిప్పర్ ఢీకొట్టిన విషయం తెలిసిందే. దాంతో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. టిప్పర్ లారీ ఢీకొట్టడం బస్పై ఒరిగిపోవడంతో అందులో ఉన్న కంకర అంతా బస్లో ఉన్న ప్రయాణికులపై పడిపోయింది. దాంతో ఎక్కువ మంది ప్రయాణికులు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో బస్ డ్రైవర్ దస్తగిరి సైతం ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం తర్వాత ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఖుష్రో షా ఖాన్, ఆపరేషన్స్ ఇన్చార్జి ఈడీ శ్రీధర్, రంగారెడ్డి రీజినల్ మేనేజర్ శ్రీలత, ఇతర సీనియర్ అధికారులు ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలను ముమ్మరం చేసినట్లు వివరించింది.
గాయపడిన 25 మందికి మెరుగైన చికిత్స అందించాలని అధికార బృందం, అక్కడి డాక్టర్లను కోరిందని చెప్పింది. చనిపోయిన 19 మందిలో 5 గురు మహిళలు, 14 మంది పురుషుల మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి వారి బంధువులకు అప్పగించడం జరిగిందని చెప్పింది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మృతి చెందిన వారికి ఒక్కొక్కరికి ప్రభుత్వం తరుఫున రూ.5 లక్షలు, ఆర్టీసీ నుంచి రూ.2లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించినట్లు తెలిపింది. గాయపడిన వారికి రూ.2 లక్షల ఎక్స్రేషియా ప్రభుత్వం ప్రకటించిందని.. అలాగే, వాహనం ఇన్సురెన్స్ పాలసీ ద్వారా బాధితులకు తగిన మొత్తంలో పరిహారం చెల్లించడం చెప్పింది. ఈ దురదృష్టకర సంఘటనలో చనిపోయిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని, గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ఆర్టీసీ ఆకాంక్షించింది.