TGSRTC | రాష్ట్రంలో పలు కొత్త బస్ డిపోలు, బస్ స్టేషన్ల నిర్మాణం, విస్తరణకు టీజీఎస్ఆర్టీసీ అనుమతినిచ్చింది. ఈ విషయాన్ని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. హైదరాబాద్ బస్ భవన్లో శనివారం జరిగిన ఆర్టీసీ బోర్డు సమావేశం ముగిసిన అనంతరం పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కొత్త డిపోల ఏర్పాటుతో పాటు ప్రస్తుతం ఉన్న 97 డిపోలు, బస్ స్టేషన్ల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. మహాలక్ష్మీ స్కీమ్ కారణంగా ఆర్టీసీ బస్సుల్లో పెరిగిందని.. దీనికి అనుగుణంగా కొత్త బస్ స్టేషన్ల నిర్మాణంతో పాటు ఉన్న వాటిని విస్తరిస్తామని పేర్కొన్నారు. బోర్డు అనుమతి లభించిన నూతన డిపోలు, బస్ స్టేషన్లు త్వరితగతిన పూర్తి చేయాలని ఈ సందర్భంగా ఆర్టీసీ అధికారులను మంత్రి ఆదేశించారు.
ఆర్టీసీ బోర్డు సమావేశంలోని కీలక నిర్ణయాలు ఇవే..
1. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కొత్త బస్ డిపో నిర్మాణం కోసం రూ.11.70 కోట్లు కేటాయిస్తూ అనుమతులు
2. ములుగు జిల్లా ఏటూరునాగారంలో కొత్త బస్ డిపో నిర్మాణం కోసం రూ.6.28 కోట్లు కేటాయిస్తూ అనుమతులు
3. ములుగు జిల్లా కేంద్రంలో కొత్త బస్ స్టేషన్ నిర్మాణం కోసం రూ. 5.11 కోట్లు కేటాయిస్తూ అనుమతులు
4. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో కొత్త బస్ స్టేషన్ కోసం రూ. 3.75 కోట్లు కేటాయిస్తూ అనుమతులు
5.ఖమ్మం జిల్లా మధిరలో ఆధునిక బస్ స్టేషన్ నిర్మాణం కోసం రూ.10 కోట్లు కేటాయిస్తూ అనుమతులు
6. ములుగు జిల్లా మంగపేటలో కొత్త బస్ స్టేషన్ నిర్మాణానికి రూ. 51.00 లక్షలు కేటాయిస్తూ అనుమతులు
7. పెద్దపల్లి జిల్లా మంథని బస్ స్టేషన్ విస్తరణ కోసం రూ.95 లక్షలు కేటాయిస్తూ అనుమతులు
8. సూర్యాపేట జిల్లా కోదాడ వద్ద ఆధునిక బస్ స్టేషన్ నిర్మాణం కోసం రూ. 17.95 కోట్లు కేటాయిస్తూ అనుమతులు
9. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో ఆధునిక బస్ స్టేషన్ నిర్మాణం కోసం రాబోయే “సరస్వతి పుష్కరాల” దృష్ట్యా ఆధునిక బస్ స్టేషన్ నిర్మాణానికి రూ. 3.95 కోట్లు కేటాయిస్తూ ఆర్టీసీ బోర్డు అనుమతులు ఇచ్చింది.