హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) మంగళవారం మూడు ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేసింది. మూడు విభాగాల్లో ఇంజినీరింగ్ పోస్టుల భర్తీకి వేర్వేరు నోటిఫికేషన్లు ఇచ్చింది. ఆ మూడు నోటిఫికేషన్లతో 290 పోస్టులను భర్తీ చేయనున్నట్టు టీజీపీఎస్సీ కార్యదర్శి ఎం హరిత ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్అండ్బీ శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్) పోస్టులు 222, అదే శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్) పోస్టులు 49, తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ)లో అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ పోస్టులు 19 చొప్పున ఉన్నాయి.
18-44 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారు ఈ పోస్టులకు పోటీపడవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వారికి ఐదేండ్లు, వికలాంగులకు పదేండ్ల వయో పరిమితి సడలింపులు వర్తిస్తాయి. వేతన స్కేల్ రూ.54,220 నుంచి రూ.1,33,630గా ఉంటుంది. జనరల్ స్టడీస్, సంబంధిత సబ్జెక్టుల రెండు పేపర్లకు పరీక్షలు నిర్వహిస్తారు. జనరల్ స్టడీస్ పేపర్కు 150, సంబంధిత సబ్జెక్టు పేపర్కు 300 మార్కుల చొప్పున మొత్తం 450 మార్కులకు పరీక్షలు ఉంటాయి.