హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ) : వందల ఎకరాల ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురైనా అధికారులు స్పందించకపోవడంపై ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో కోట్ల విలువైన భూములను కబ్జాదారులు ఆక్రమించిన విషయాన్ని ప్రస్తావిస్తూ మంగళవారం ఆయన ఉన్నతాధికారులకు లేఖ రాశారు.
ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగ మయి ఫిర్యాదును ప్రస్తావిస్తూ ప్రభుత్వ భూముల పరిరక్షణలో ఉదాసీనత ప్రదర్శించిన అధికారులపై కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. ఖానామెట్ గ్రామ రెవెనూ పరిధి సర్వే నంబర్ 41/14లోని 252.24 ఎకరాల భూమి ఉండగా, 2008లో అప్పటి ప్రభుత్వం 180.13 ఎకరాలను హుడా(ప్రస్తుత హెచ్ఎండీఏ)కు కేటాయించింది.
అందులో నుంచి 75 ఎకరాలను పారిశ్రామిక మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ(ప్రస్తుత టీజీఐఐసీ)కు హుడా బదిలీ చేసింది. హుడా ఆధీనంలోని 105.13 ఎకరాలు, టీజీఐఐసీ యాజమాన్యంలోని 75 ఎకరాల్లో అత్యధిక భాగం కబ్జాదారుల ఆధీనంలోకి వెళ్లిందని శ్రీధర్బాబు ఆవేదన వ్యక్తంచేశారు. శేరిలింగంపల్లి మండలం మియాపూర్లోని 100, 101 సర్వే నంబర్లలోని 100 ఎకరాల భూమి కబ్జాకు యత్నాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు.