హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. కరోనా కారణంగా రెండేండ్ల తర్వాత మొదటిసారిగా ప్రత్యక్షంగా పరీక్షలు జరుగుతున్నాయి. దీంతో పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థుల తల్లిదండ్రుల సందడి నెలకొన్నది. రాష్ట్రవ్యాప్తంగా 2,861 కేంద్రాల్లో పరీక్షలను ఏర్పాటు చేశారు. 5,08,110 మంది రెగ్యులర్, 1,165 మంది ప్రైవేట్ కలిపి మొత్తం 5,09,275 విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు.
విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి ఉదయం 8.30 గంటల నుంచి అనుమతిస్తున్నారు. పరీక్ష ప్రారంభమైన తర్వాత ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చినవారిని కూడా అనుమతించారు. పరీక్షా కేంద్రాలకు గంటముందే చేరుకున్న విద్యార్థులను ఉపాధ్యాయులు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే అనుమతించారు. పరీక్షా కేంద్రాల్లో కరోనా నిబంధనలను అమలు చేస్తున్నారు.