భువనగిరి: భువనగిరిలో (Bhuvanagiri) ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్యకు పాల్పడటంతో పట్టణంలోని ఎస్సీ బాలికల హాస్టల్ ఎదుట ఉద్రిక్తత నెలకొంది. బాలికల బలవన్మరణంపై తమకు అనుమానాలు ఉన్నాయని, అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థునుల బంధువులు, విద్యార్థులు హాస్టల్ ఎదుట ఆందోళనకు దిగారు. తమ పిల్లలను హత్య చేశారంటూ బాలికల బంధువులు ఆరోపిస్తున్నారు. ఈనేపథ్యంలో హాస్టల్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు.
హైదరాబాద్లోని హబ్సిగూడకు చెందిన భవ్య (15), వైష్ణవి (15) భువనగిరిలోని ఎస్సీ బాలికల హాస్టల్లో ఉంటూ భువనగిరి పట్టణంలోని బీచ్ మహల్లా ప్రభుత్వ ఉన్నత బాలికల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నారు. స్నేహితులైన వీరిద్దరూ తమను వేధింపులకు గురి చేశారంటూ అదే హాస్టల్లో ఉంటున్న 7వ తరగతి విద్యార్థినులు నలుగురు.. పాఠశాల పీఈటీకి ఫిర్యాదు చేశారు. ఆమె హాస్టల్ వార్డెన్ శైలజకు సమాచారం ఇచ్చారు. ఆమె భవ్య, వైష్ణవిలను మందలించడంతో పాటు హాస్టల్లో జూనియర్, సీనియర్ విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అంతేగాకుండా భవ్య, వైష్ణవిల తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా సమాచారం చేరవేశారు.
దీంతో మనస్తాపానికి గురైన భవ్య, వైష్ణవి శనివారం సాయంత్రం తర్వాత విద్యార్థినులంతా డిన్నర్కు వెళ్లగా, వీరు మాత్రం వెళ్లలేదు. అనుమానం వచ్చి తోటి విద్యార్థినులు గదిలోకి వెళ్లి చూడగా, ఇద్దరు ఫ్యాన్కు ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించారు. వారిని వెంటనే 108 అంబులెన్స్లో స్థానిక భువనగిరి ఏరియా దవాఖానకు తరలించగా, అప్పటి కే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు.