హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): రైస్ మిల్లర్లు తమ వద్ద ఉన్న ప్రతి గింజకూ లెక్క చెప్పాల్సిందేనని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి హెచ్చరించారు. కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) వ్యవస్థపై పన్నెండు సంవత్సరాల కార్యకలాపాలపై సమగ్ర ఆడిట్ నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిపారు. మంగళవారం ఆయన సచివాలయంలో ధాన్యం సేకరణ, సీఎంఆర్ బకాయిలు, ఎఫ్సీఐకి అప్పగించిన బియ్యం, జిల్లాల వారీగా, మిల్లర్ల వారీగా పెండింగ్ డిఫాల్ట్లు, రికవరీల పురోగతి, విజిలెన్స్ కేసులు, న్యాయపరమైన చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రజల సొ మ్ముతో కొనుగోలు చేసిన ధాన్యా న్ని, ప్రభుత్వానికి రావలసిన ప్రతి రూపాయిని తిరిగి రాబట్టడమేనని స్పష్టంచేశారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ డీఎస్ చౌహాన్, పౌరసరఫరాల కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ధాన్యంపై నిర్వహించిన తనిఖీలు, రికవరీపై నివేదిక సమర్పించారు.
రాష్ట్రవ్యాప్తంగా రైస్ మిల్లుల్లో తనిఖీలు, స్టాక్ రిజిస్టర్ల పరిశీలన, కొనుగోలు రికార్డులతో సరిపోల్చడం, ప్రభుత్వ ధాన్యం అక్రమ మళ్లింపులపై విచారణ కొనసాగించాలని , మోసాలకు పాల్పడే మిల్లర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతోపాటు పదేపదే డిఫాల్ట్ చేస్తున్న మిల్లర్లపై బ్లాక్లిస్టింగ్ సహా కఠిన పరిపాలనాపరమైన చర్యలు తీసుకొంటామని అధికారులు తెలిపారు. భవిష్యత్తులో పరిస్థితులు పునరావృతం కాకుండా సీఎంఆర్ నియంత్రణ ఉత్తర్వులను సవరించేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందని మంత్రి తెలిపారు. ఒప్పంద నిబంధనలను కఠినతరం చేయడం, డిఫాల్ట్లపై శిక్షలు, అమలు వ్యవస్థను సమర్థంగా రూపొందించడం వంటి అంశాలను కొత్త విధానంలో చేర్చాలని ఆదేశించారు. సీఎంఆర్ డిఫాల్టర్లను ముందుగానే గుర్తించేందుకు ‘ఎర్లీ వార్నింగ్ సిస్టమ్’ను అమలు చేయాలని సూచించారు.