హైదరాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ‘మన ఊరు-మన బడి, మన బస్తీ-మన బడి’ పథకం కింద పాఠశాలలకు ఫర్నిచర్ సరఫరా కోసం జైళ్ల శాఖకు ఇచ్చిన ఉత్తర్వుల అమలును నిలిపివేసేందుకు హైకోర్టు నిరాకరించింది. జనవరి 17న జారీచేసిన టెండర్ నోటిఫికేషన్ను ప్రభుత్వం రద్దు చేసినప్పటికీ ఫర్నిచర్ సరఫరా బాధ్యతలను మరో ప్రైవేట్ సంస్థకు ఇవ్వలేదని హైకోర్టు పేర్కొన్నది. ఫర్నీచర్ సరఫరా బాధ్యతలను ప్రభుత్వం జైళ్ల శాఖకు అప్పగించినందున టెండర్ అమలును నిలిపివేయలేమని స్పష్టం చేసింది.
పాఠశాలలకు రూ. 291.15 కోట్ల విలువైన ఫర్నిచర్ సరఫరా చేయాలని జైళ్లశాఖను ఆదేశిస్తూ ఏప్రిల్ 4న ప్రభుత్వం ఇచ్చిన ప్రొసీడింగ్స్కు వ్యతిరేకంగా హైదరాబాద్కు చెందిన చింతామణి పరస్వత్ ఎంటర్ ప్రెజైస్ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ముమ్మినేని సుధీర్ కుమార్ ఇటీవల విచారణ చేపట్టారు. టెండర్ పిలిచాక పిటిషనర్ కంపెనీ మొదటి స్థానంలో నిలిచిందని, ఆ టెండర్ను ప్రభుత్వం రద్దు చేసి ఫర్నిచర్ సరఫరా బాధ్యతను జైళ్ల శాఖకు అప్పగించడాన్ని కొట్టివేయాలని పిటిషనర్ తరఫు లాయర్ నవీన్ కుమార్ వాదించారు.
ఈ మేరకు మధ్యంతర స్టే ఉత్తర్వులు ఇవ్వాలని ఆయన చేసిన అభ్యర్థనను న్యాయమూర్తి తోసిపుచ్చారు. సమగ్ర వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ విద్యాశాఖ ముఖ్యకార్యదర్శితోపాటు రాష్ట్ర విద్య, మౌలిక వసతుల అభివృద్ధి కార్పొరేషన్, ఆ సంస్థ చీఫ్ ఇంజినీర్, టెండర్ల కమిషనర్, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్, చర్లపల్లి జైలు సూపరింటెండెంట్ను ఆదేశించిన న్యాయమూర్తి.. తదుపరి విచారణను జూన్ నెలకు వాయిదా వేశారు.