Temples Development | తెలంగాణ రాష్ట్రం ఆధ్యాత్మిక వైభవాన్ని సంతరించుకున్నది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఓ ప్రణాళికాబద్ధంగా ఆలయాల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. దేశంలోనే అత్యంత పురాతన పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా పేరొందిన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని దాదాపు రూ.1,200 కోట్ల వ్యయంతో పునర్నిర్మించిన ప్రభుత్వం, ఇదే క్రమంలో రాష్ట్రంలోని ఇతర ప్రముఖ ఆలయాలను సైతం క్రమంగా అభివృద్ధి చేస్తున్నది. స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్(ఎస్డీఎఫ్) పథకం కింద జిల్లాల్లో ఆలయాలను ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్నది. ఇదివరకే ప్రభుత్వం 16 ఆలయాల్లో సుమారు రూ.170 కోట్ల వ్యయమయ్యే పనులు మంజూరు చేయగా, కొత్తగా మరో ఐదు ఆలయాలకు రూ.136 కోట్లు మంజూరు చేసింది.
ఈ నిధులతో వేములవాడ రాజరాజేశ్వరస్వామి, కాళేశ్వరం శ్రీకాళేశ్వర, శ్రీ ముక్తేశ్వర స్వామి, బాసర జ్ఞానసరస్వతి, ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి, దుబ్బాక శ్రీ వెంకటేశ్వరస్వామి, కామారెడ్డి జిల్లా తిమ్మాపూర్ శ్రీ వెంకటేశ్వరస్వామి, ఖమ్మం జిల్లా ముత్తారం శ్రీ సీతారామచంద్రస్వామి, మహబూబాబాద్ శ్రీరామమందిరం, సూర్యాపేట అర్వపల్లి శ్రీ యోగానంద లక్ష్మీనరసింహస్వామి, మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట శ్రీ వెంకటేశ్వరస్వామి, మహబూబాబాద్ జిల్లా ఉగ్గంపల్లి శ్రీ రామలింగేశ్వరస్వామి, సిద్దిపేట చింతమడక శివాలయం, సిద్దిపేట కొమురవెల్లి శ్రీ మల్లికార్జునస్వామి, సిద్దిపేట కోనాయిపల్లి శ్రీ వెంకటేశ్వరస్వామి, సూర్యాపేట దూరాజ్పల్లి శ్రీ లింగమంతుల స్వామి, కామారెడ్డి సలాబత్పూర్ శ్రీ మారుతీ మందిర్ తదితర ఆలయాలను అభివృద్ధి చేస్తున్నది. కొండగట్టు ఆంజనేయస్వామి తదితర ఆలయాల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం కాగా, పనులు చేపట్టేందుకు దేవాదాయ శాఖ సన్నాహాలు చేస్తున్నది.