యాదగిరిగుట్ట, మే 16: యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ఆన్లైన్ సేవలను ఆలయ అధికారులు పునఃప్రారంభించారు. దేవస్థానంలో స్వామివారి సేవలు, దర్శన టికెట్లను ఆన్లైన్లో అందజేసే వెబ్పోర్టల్ను ఆధునీకరించారు. దీంతోపాటు దేవస్థాన ఆన్లైన్ సేవలను పూర్తిగా ఈసీఐఎల్ కంపెనీకి అప్పగించగా పనులు సాగుతున్న నేపథ్యంలో కొద్దిరోజులుగా దేవస్థాన వెబ్ పోర్టల్ను తాత్కాలికంగా నిలిపివేశారు. ఆధునీకరణ ప్రక్రియ పూర్తయిన సందర్భంగా మంగళవారం తిరిగి ప్రారంభించారు. భక్తులు బుధవారం నుంచి ఆన్లైన్లో yadadritemple.telangana.gov.in సేవలను వినియోగించుకోవాలని ఈవో గీత సూచించారు.
స్వామివారి ఆర్జిత సేవలైన నిజాభిషేకం, సహస్రనామార్చన, సుదర్శన నారసింహా హోమం, స్వామివారి నిత్య తిరుకల్యాణోత్సవం, శయనోత్సవం, జోడు సేవలు, సువర్ణ పుష్పార్చన, సుప్రభాత దర్శనం, దర్బార్ సేవ, అష్టోత్తర శతఘటాభిషేకం, సత్యనారాయణ స్వామి వ్రతం, వాహన పూజలు, పదేండ్లపాటు శాశ్వత పూజలు, శాశ్వత నిజాభిషేకం పూజలతోపాటు లక్ష్మీ నిలయం, నృసింహ నిలయం, ప్రహ్లాద నిలయంలో అద్దె గదులు ఆన్లైన్లోనే బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. దీంతోపాటు రూ.150 దర్శనాలు, బ్రేక్ దర్శనాల టికెట్లు, స్వామివారికి భక్తులు విరాళాలు సమర్పించుకునేందుకు ఈ-హుండీ, నిత్యన్నదాన విరాళం ఆన్లైన్లో అందుబాటులోకి తీసుకువచ్చారు. దీంతోపాటు స్వామివారి ఆలయ వేళలు సైతం ఆన్లైన్లో భక్తులు వీక్షించే వీలు కల్పించారు.